విజయవాడ: అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపించడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ బడ్జెట్ ఉన్నదని బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. ఏపీ బడ్జెట్పై శనివారం ఆయన వరస ట్వీట్లతో వైసీపీ ప్రభుత్వానికి చురకలంటించారు. జగన్ను పొగడటమే ఏపీ ఆర్థిక మంత్రి లక్ష్యమైతే రాజరాజ నరేంద్రుడు మొదలుకొని కృష్ణ దేవరాయలు వరకు గొప్పగా పాలించిన రెడ్డిరాజులు ఎందరో ఉన్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై సెటైర్లు వేశారు.
పరిమితి లేకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దశగా నడిపించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్లు బడ్జెట్ పరిశీలిస్తే తెలుస్తున్నదని ఐవైఆర్ అన్నారు. ఈ మధ్య విడుదలైన కాగ్ లెక్కల ప్రకారం 2021-22 తొమ్మిది నెలలకు రెవిన్యూ లోటు రూ.45,900 కోట్లుగా ఉండగా.. ఈ బడ్జెట్లో మొత్తం 2021-22 సంవత్సరానికి రెవెన్యూ లోటును రూ.19,545 కోట్లుగా చూపించారని తెలిపారు. మిగిలిన మూడు నెలలతో కలిపి ఈ రెవిన్యూలోటు రూ.45,900 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి కానీ తక్కువ కాదన్నారు. దీని అర్థం మిగిలిన 3 నెలల్లో చెల్లించాల్సినవి చెల్లించకుండా ఖర్చులు తగ్గించి చూపి మసిపూసి మారేడుకాయ చేసి కృత్రిమంగా రెవెన్యూ లోటును తగ్గించారని ఆరోపించారు. దీని ప్రభావం 2022-23 సంవత్సరం ప్రారంభంలో ఈ బిల్లుల చెల్లింపుతో ప్రారంభంలోనే ఆర్థిక సమస్యలు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు.