తిరుమల : ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులకు ఈ నెల 21 న భూమి పూజ చేయనున్నారు. ఈ ఆలయాన్ని తిరుపతి, తిరుమల దేవస్థానం నిర్మిస్తున్నది. ఈ ఆలయ నిర్మాణం నిమిత్తం మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించింది. ఈ నెల 21 న జరిపే భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులను టీటీడీ ఆహ్వానించింది.
ముంబైలో టీటీడీ నిర్మించతలపెట్టిన శ్రీవారి ఆలయ భూమి పూజ ఈ నెల 21 న ముహూర్తం ఖరారైంది. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆహ్వాన పత్రం అందజేశారు. ముంబైలో సీఎం , డిప్యూటీ సీఎం లను కలిశారు. టీటీడీ వేద పండితులు షిండే, ఫడ్నవీస్కు వేద ఆశీర్వచనం అందించారు. చైర్మన్, ఈఓ శాలువాతో వారిని సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భూమి పూజలో పాల్గొనేందుకు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ సుముఖత వ్యక్తం చేశారని టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించింది. రేమండ్స్ కంపెనీ అధినేత గౌతం సింఘానియా ఈ భూమిలో స్వామి వారి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చారు.
ఆగస్టు 11న డయల్ యువర్ ఈఓ
డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని టీటీడీ ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి అందజేయవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు 0877-2263261 నంబరులో సంప్రదించాల్సి ఉంటుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
దయచేసి గమనించండి..
ఆగస్టు 11 నుంచి 15 వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు దర్శనం, వసతిని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. వారాంతంలో రద్దీ, ఈ నెల 19 వరకు పండగ సెలవులు, పవిత్ర పెరటాసి మాసం కూడా వచ్చే నెల 18 న ప్రారంభం కానున్నది. ఈ దృష్ట్యా వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శిశువులు ఉన్న తల్లిదండ్రులు అసౌకర్యానికి గురికాకుండా పెరటాసి మాసం తర్వాత తిరుమల తీర్థయాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.