అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వానికి కొత్త సవాళ్లను తీసుకొస్తున్నది. ప్రస్తుతం ఉన్న జిల్లాలకు తోడుగా మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, కడప జిల్లాల నుంచి నిరసనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కాగా, కొత్త జిల్లాల ఏర్పాటును తొలుత స్వాగతించిన నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు మాట మార్చారు. రాయచోటిగా ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాకు జిల్లా కేంద్రంగా ఎంతో అభివృద్ధి సాధించిన హిందూపురంను ఏర్పాటుచేస్తే బాగుంటుందనే సూచన చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాస్తానని వారం రోజుల క్రితం చెప్పారు. ప్రభుత్వానికి అభ్యంతరాలను వ్యక్తం చేసిందీ లేనిదీ తెలియనప్పటికీ.. రేపటి నుంచి హిందూపురం జిల్లా సాధన కోసం మౌనదీక్ష చేపట్టాలని బాలకృష్ణ నిర్ణయించినట్లు సమాచారం. హిందూపురంలో భారీ ర్యాలీ చేపట్టి తమ ప్రాంత ప్రజల డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ర్యాలీ అనంతరం అఖిల పక్ష పార్టీల నేతలతో సమావేశమై చర్చించేందుకు బాలకృష్ణ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
ఇలాఉండగా, కర్నూలు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను 14 జిల్లాలుగా మార్చాలని ఆయన సూచించారు. ఈ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు చాలా పెద్దగా ఉన్నాయని, అనంతపురం, కర్నూలు జిల్లాలను 4 జిల్లాలుగా విభజించడం మంచిదని అభిప్రాయపడ్డారు. అలాగే, కడప, చిత్తూరు జిల్లాలను 3 జిల్లాలుగా పునర్విభజించాలని సూచించారు. ఇదే సమయంలో ఆదోని, మదనపల్లెను జిల్లాలుగా చేయాల్సిన అవసరం ఉన్నదని ప్రస్తుతం బీజేపీలో ఉన్న బైరెడ్డ రాజశేఖర్రెడ్డి చెప్పారు.