అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలపైన, ఆ తర్వాత ప్రెస్ మీట్లో టీడీపీ అధినేత, తన వియ్యంకుడు చంద్రబాబు విలపించడంపైన హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ స్పందించారు. కుటుంబంతో కలిసి శనివారం ప్రెస్ మీట్లో మాట్లాడిన బాలకృష్ణ.. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలు చాలా బాధాకరమన్నారు. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారపక్ష నేతలు రాష్ట్ర అభివృద్ధి ఎజెండాను పక్కనపెట్టి వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చారని విమర్శించారు.
ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు ఎప్పుడూ కంటతడి పెట్టుకోలేని, మా సోదరి గురించి నీచంగా మాట్లాడి ఆయనను మానసికంగా వేధించారని బాలకృష్ణ ఆరోపించారు. ప్రజాసమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఉన్నదని, కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో తాము వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరినీ విమర్శించలేదని చెప్పారు. అసెంబ్లీలో మా సోదరి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం చూస్తే.. చట్టసభలో ఉన్నామో.. పశువుల చావిట్లో ఉన్నామో అర్థం కాలేదన్నారు.
అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారని, ఆడవాళ్లను హేళన చేయడం సంస్కారం కాదని బాలకృష్ణ హితవు పలికారు. రాజకీయాలతో సంబంధంలేని వారిపై మాటల దాడి ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఏకపక్షంగా సభను నడుపుతున్నారని, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని అన్నారు. అధికార పార్టీవాళ్లు దోచుకున్న సొమ్ము దాచుకోవడమే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో తమ సోదరిపై మాటల దాడిని వైసీపీ నేతలు, జగన్ కుటుంబంలోని ఆడవాళ్లు కూడా అసహ్యించుకుంటారని అన్నారు.
ఇకపై మా ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకుని కూర్చోమని, పద్ధతి మార్చుకోవాలని, లేదంటే మెడలు వంచి మారుస్తామని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై ఆడవాళ్ల గురించి చెడుగా ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదని, ఖబడ్దార్ అని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి నీచమైన పదాలు వాడితే భరతం పడతామని మండిపడ్డారు.