అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెర్ప్తో ఇంటిగ్రేటెడ్ టెక్ ప్లాట్ఫాం అయెకార్ట్ జతకట్టింది. ఈ మేరకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాలనాయుడు సమక్షంలో ఆయెకార్ట్ అధ్యక్షుడు, సెర్ప్ సీఈవో ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ కమ్యూనిటీ స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జీ), రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీఓ) లకు ప్రోత్సాహాన్ని అందించాలన్న లక్ష్యంతో ఏపీ సెర్ప్తో అయెకార్ట్ ఒప్పందం కుదుర్చుకున్నది.
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి కోసం సెర్ప్ విశేషమైన కృషి చేస్తున్నది. రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించేందుకు, రాష్ట్రంలోని గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఈ సంస్ధ దోహదపడుతున్నది. 69,31,113 మంది గ్రామీణ మహిళలతో 6,52,440 స్వయం సహాయక సంఘాలు, 26,753 గ్రామ సంస్థలు, 656 మండల సమాఖ్యలు, 13 జిల్లా సమాఖ్యలతో ఉన్న సెర్ప్తో పనిచేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చేందుకు అనుగుణంగా ఉంటుందని అయెకార్ట్ అధ్యక్షుడు అమిత్ కుమార్ సింగ్ చెప్పారు.
ఏపీ ప్రభుత్వంతో ఈ ఎంఓయూ కుదుర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు అయెకార్ట్ సహా వ్యవస్థాపకుడు, సీఈఓ దేబర్షి దత్తా చెప్పారు. దేశంలో ఆహారం, వ్యవసాయ విలువ చైన్ను డిజిటలైజ్ చేయడం, గ్రామీణ ఎఫ్పీఓలకు సహాయం చేయడం, వారికి సాధికారత కల్పించడం మా ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు.