అమరావతి: నివాస స్థలాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్, సిబ్బంది అక్రమంగా కూల్చివేయడం పట్ల ఓ వృద్ధ పూజారి మనస్థాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సంత మార్కెట్ వద్ద శనివారం చోటు చేసుకుంది. రామలింగాచారి అనే వృద్ధ పూజారి గత 30 సంవత్సరాలుగా భీమడోలు సంత మార్కెట్ వద్ద ఉన్న తన భూమిలో కామాక్షమ్మ ఆలయంతో పాటు ఓ రేకుల షెడ్డు వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ స్థల విషయంలో తరచూ గోడవలు జరుగుతున్నాయి.
శనివారం తెల్లవారు జామున పంచాయతీ మహిళా సర్పంచ్ తో పాటు పంచాయతీ సిబ్బంది పూజారి ఉంటున్న రేకుల షెడ్డును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. దీంతో మనస్థాపానికి గురైన పూజారి పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు గమనించి అతడిని వెంటనే భీమడోలు ప్రభుత్వ దవాఖానలో చేర్పించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.