Donnu Dora | అరకు టీడీపీలో అసమ్మతి రోజురోజుకీ పెరిగిపోతుంది. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఆత్మహత్యాయత్నం చేసిన దొన్ను దొర.. తన సీటు లాక్కున్న వారి అంతుచూస్తానని హెచ్చరించారు. అరకు టికెట్ను బీజేపీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణుల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఆయన మాటలను నమ్మలేమని విమర్శించారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
కార్యకర్తల మనోభావాలను తీసుకోకుండా బీజేపీకి అరకు టికెట్ కేటాయించడం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారని దొన్ను దొర తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు తాను అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నా అని తెలిపారు. అరకు నియోజకవర్గంలో బీజేపీకి సహకరించేది లేదని స్పష్టం చేశారు. తనకు న్యాయం జరగకపోతే చావడానికైనా.. చంపడానికైనా సిద్ధమని హెచ్చరించారు. బీజేపీతో చావో రేవో తేల్చుకుంటానని అన్నారు.