విజయనగరం: ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (ఏపీ సీపీఎస్) ఎంప్లాయీస్ అసోసియేషన్ వచ్చే సెప్టెంబర్ 1 వ తేదీన మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలన్న డిమాండ్తో వీరు ఆందోళనకు దిగుతున్నారు. 2003 సంవత్సరం వరకు ఉన్న పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 24న శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం సంఘం నేతలు సమావేశమై ధర్మ పోరాట సభ పోస్టర్లను విడుదల చేశారు.
జులై 24న ‘ధర్మ పోరాట సభ’ పేరుతో నిర్వహించనున్న సీపీఎస్ ఉద్యోగుల బహిరంగ సభకు ఉద్యోగుల మద్దతు కూడగట్టేందుకు అసోషియేషన్ నాయకులు గంటా శ్రీనివాసరావు, ఆర్ శివకుమార్, సైలాడ అప్పలనాయుడు, కే ధనుంజయ తదితరులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శిస్తున్నారు. ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు ఉద్యోగులను కోరుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఆందోళనలను ఉధృతం చేసేందుకు వారు నిర్ణయించుకున్నారు.
గత కొన్నిరోజులుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం తదితర ప్రాంతాల్లోని దాదాపు 50 ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి కార్యాచరణ ప్రణాళికను వివరించి మద్దతు కోరామని ఏపీ సీపీఎన్ అసోసియేషన్ నాయకుడు గంటా శ్రీనివాసరావు తెలిపారు.
దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులకు సీపీఎస్ కింద తక్కువ పెన్షన్ వస్తుందని, పదవీ విరమణ తర్వాత ఎలాంటి సామాజిక భద్రత ఉండదదని విచారం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించడానికి బదులుగా కమిటీలను నియమించడం ద్వారా ప్రభుత్వం సమస్యపై మెతకగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అందుకే ధర్మ పోరాట సభ, మిలియన్ మార్చ్ కార్యాచరణ చేపట్టనున్నట్లు మరో నేత శివకుమార్ వెల్లడించారు.