అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఢిల్లీలో మాదిరి సర్వోదయ బోధనా పద్ధతులను తీసుకురానున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, సర్వోదయ స్కూల్ తరహాలో బోధనా విధానాలతో ప్రయోగాత్మకంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తున్నది. దీనికి విజయవాడలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, వీఎంఆర్ హైస్కూల్ ఎంపికయ్యాయి.
ఈ రెండు పాఠశాలలను సర్వోదయ పాఠశాలలుగా మార్చే అవకాశాలను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, నాడు-నేడు ఇన్ఫ్రా జాయింట్ డైరెక్టర్ మురళి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఈఓ రేణుక ఇప్పటికే పరిశీలించి కార్పొరేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తరహా విద్యావిధానం కింద ఒకే పాఠశాల సముదాయంలో పీపీ1, పీపీ2 నుంచి 10 + 2 వరకు బోధన ప్రారంభించడానికి అన్ని సౌకర్యాలు అందించబడతాయి. అలాగే పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ హైస్కూల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్ను స్పోర్ట్స్ స్కూల్గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సర్వోదయ పాఠశాల బోధన పద్ధతుల రాకతో విజయవాడ పాఠశాలల్లో బోధన మెరుగుపడనున్నది. ఇందుకోసం ఓ బృందాన్ని ఢిల్లీకి పంపనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి విజయవాడలో ప్రయోగాత్మకంగా పాఠశాలల ఏర్పాటుకు అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని అనువైన పాఠశాలల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. నగరంలోని మున్సిపల్ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విజయవాడ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఇందులో భాగంగా 10+2 వరకు ఒకే చోట అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందజేస్తామని, ఢిల్లీలో మాదిరి సర్వోదయ విద్యా బోధన విజయవాడలో ప్రయోగాత్మకంగా చేపడతామని చెప్పారు.