తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగుల తీరు విచిత్రంగా మారింది. ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా వారి పరిస్థితి తయారైంది. ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని ఆనందపడాలో.. కోట్లల్లో ఉన్న లెక్కలు తేల్చలేకపోతున్నామని ఆందోళన చెందాలో అర్థంకాని పరిస్థితిలో వారున్నారు. బకాయి లెక్కలు తేల్చితేనే ప్రొబేషన్ ఖరారుకు ప్రభుత్వం ఆదేశించడంతో మింగలేక కక్కలేక గ్రామ సచివాలయ ఉద్యోగులు సతమతమవుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఆనందంలో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఓటీఎస్ బకాయిలు ఇబ్బందిగా మారుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇళ్ల క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభుత్వం ప్రజల నుంచి ఓటీఎస్ వసూళ్లు చేపట్టింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఓటీఎస్ వసూళ్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల నుంచి బకాయిలు రావాల్సి ఉన్నది.
ఈ బకాయిలే ఇప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగుల పాలిట శాపంలా పరిణమించిందని చెప్పవచ్చు. ప్రజల నుంచి వసూలు చేసిన ఓటీఎస్ మొత్తంలో రూ.82.46 కోట్లకు సంబంధించిన లెక్కలు తేలలేదు. ఈ లెక్కలు తేల్చిన తర్వాతనే గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. చలానా జనరేట్ చేసి డిపాజిట్ చేయనివి, అసలు చలానానే జనరేట్ చేయనివి తేల్చాలని సీఎస్ సూచించారు. ఈ ఆదేశాలతో ప్రొబేషన్ ఖరారై ప్రభుత్వం ఉద్యోగంలోకి వెళ్లాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు గుదిబండగా మారనున్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.