AP News | ఏసీబీ అధికారిగా నటించి తహశీల్దార్ను బురిడీ కొట్టించి రూ.50 లక్షలు కాజేసిన ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మోసగాడినికి చివరకు సత్యసాయి జిల్లాలో అరెస్టు చేశారు.
అసలేమైందంటే.. 2021లో అనంతపురం జిల్లా ముదిగబ్బులో తహశీల్దార్గా పనిచేస్తున్న అన్వర్ హుస్సేన్కు ఓ వ్యక్తి కాల్ చేశాడు. తాను ఏసీబీ అధికారిని అని నమ్మించాడు. అవినీతి కేసులు పెట్టిస్తానని భయపెట్టి రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. భయపడిపోయిన తహశీల్దార్ వెంటనే నకిలీ ఏసీబీ అధికారికి రూ.50 లక్షలు ఇచ్చాడు. డబ్బు చేతిలో పడగానే కాల్ చేసిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. అప్పట్లోనే మోసపోయానని గ్రహించిన అన్వర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన ఎరుకల హనుమంతుగా గుర్తించారు.
అయితే గత ఐదేళ్లుగా హనుమంతు ఆచూకీ దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు సాంకేతిక ఆధారాలు, గోప్య సమాచారంతో నిందితుడి కదలికలను కొంతకాలంగా గమనిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నిన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.