అమరావతి: ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు పని గంటలతోపాటు వేతనాలను కూడా పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం పొందుతున్న వేతనాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా పని గంటలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల డ్వామా పీడీలను, ఉపాధి హామీ పథకం సమన్వయకర్తలను ఆదేశించింది.
ప్రస్తుతం ఈ పథకం కింద గ్రామాల్లో పనిచేస్తున్న వారికి సగటున రోజుకు రూ. 221 అందుతున్నాయి. కాగా, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గరిష్టంగా రూ.245 వేతనం అందే అవకాశం ఉన్నది. కూలీ రూ.245 అందేలా పనిగంటలను పెంచాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. రానున్న వేసవి దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు పనులు జరిగేలా చూడాలని జిల్లా అధికారులకు సూచించారు. మరోవైపు ఒక్కో లేబర్ఫోర్స్ (ఎస్ఎస్ గ్రూప్) లో 40 మంది కూలీలు సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కమిషనర్ ఆదేశించారు. ప్రతి గ్రూపులో ఒక చదువుకున్న మహిళను గుర్తించి వర్క్సైట్ సూపర్వైజర్ పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టడంతో ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పన పెంపుదలపై గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టి సారించింది. ఇక నుంచి రానున్న 40 రోజుల పాటు ప్రతి జిల్లాలో కనీసం లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉండాలని గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా మార్చి నెలాఖరు నాటికి జిల్లాల్లో ఐదు కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.