అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు తగ్గింపుతోపాటు థియేటర్ల సీజ్ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది. ఒకవైపు సినిమా పెద్దలతో మాట్లాడుతూనే.. మరోవైపు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. నిన్నటి నిన్న ప్రకాశం జిల్లాలో ఒక థియేటర్ను అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.
సినిమా థియేటర్ను సీజ్ చేసే అధికారం తాసిల్దార్కు లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదన్న కారణంతో సినిమా థియేటర్ను తాసిల్దార్ సీజ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిబంధనలు పాటించని కారణంగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్ థియేటర్ను సీజ్ చేస్తున్నట్లు గతంలో తాసిల్దార్ ప్రకటించారు. అయితే తాసిల్దార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థియేటర్ యజమాని శంకర్రావు హైకోర్టును ఆశ్రయించాడు.
థియేటర్ యజమాని దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు విన్నది. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తాసిల్దార్ థియేటర్ను సీజ్ చేశారని కోర్టుకు వివరించగా.. ఆయన వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న జాయింట్ కలెక్టర్కు మాత్రమే థియేటర్ను సీజ్ చేసే అధికారం ఉంటుందని న్యాయమూర్తి వెల్లడించారు. సీజ్ చేసిన థియేటర్ను వెంటనే తెరిచేలా చర్యలు తీసుకోవడంతోపాటు లైసెన్స్ పునరుద్ధరణ కూడా చూడాలని ఆదేశించింది. లైసెన్స్ పునరుద్దరణ దరఖాస్తు అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని సూచించింది.