అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా ఉత్పత్తులను అమెజాన్ ద్వారా అమ్మేందుకు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులు త్వరలో అమెజాన్ ద్వారా డిజిటల్ మార్కెట్లోకి రానున్నాయి. వారం క్రితం విజయవాడ వచ్చిన అమెజాన్ ప్రతినిధులతో సెర్ప్ అధికారులు సమావేశమై చర్చించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ ద్వారా అమెజాన్లో విక్రయించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు అంగీకరించారు. అమెజాన్లో అందుబాటులో ఉంచిన ఉత్పత్తులను వినియోగదారుడు కొనుగోలు చేస్తే.. వారికి నిర్ణీత గడువులోగా అందించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు దాదాపు 6 వేల రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు వీటిని డ్వాక్రా బజార్లలోనే విక్రయిస్తున్నారు. ఇప్పుడు అమెజాన్తో ఒప్పందం చేసుకోవడంతో ఆ ఉత్పత్తులకు మంచి ప్రాచుర్యత లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో డ్వాక్రా మహిళలకు ఆదాయం కూడా అంది వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అమెజాన్ ప్రతినిధులు కొన్ని సూచనలు చేశారు. డ్వాక్రా ఉత్పత్తులను సరఫరా చేసేందుకు స్టాక్ పాయింట్ను ఏర్పాటు చేయాలి. ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులను అందుబాటులో ఉంచాలి. దీంతో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసే అంశంపై సెర్ప్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను అమెజాన్ ప్రతినిధులు ఈ నెల 18న సెర్ప్ అధికారులకు అందజేయనున్నారు. అమెజాన్ ద్వారా డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాలు మొదలైతే.. ఏపీలో తయారవుతున్న వస్తువులకు గిరీకీ పెరుగుతుందని చెప్పవచ్చు.