Pawan Kalyan | ప్రధాని మోదీ వేసిన పునాదులతో 2047 నాటికి వికసిత భారత్ను చూస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేసి 23 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆయనకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇదే రోజున నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. విప్లవాత్మక నిర్ణయాలతో కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చడం ఆ రోజుతోనే మొదలైందని అన్నారు. ఆయన నాయకత్వంలో మన దేశం విశ్వవ్యాప్తంగా కీర్తిని పొంది.. అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని చెప్పారు. త్వరలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రజా సేవ కంటే మరేది ముఖ్యం కాదని మోదీ నిరూపించారని చెప్పారు.
భారత దేశ వైవిధ్యతతను లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు ప్రజలతో కలిసిపోగలిగే లక్షణాలు.. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంతో పాటు మార్పు తీసుకురావడంలో సహాయం చేశాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన నాయకత్వం దేశాన్ని పురోగమించే దిశగా తీసుకెళ్లడంతో పాటు.. అనేక మంది జీవితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు.ఆయన వేసిన పునాదులతో 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత దేశాన్ని చూస్తామని అభిప్రాయపడ్డారు.