అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్తం గడిచిన మూడేళ్లలో 3లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శ పురందేశ్వరి ఆరోపించారు. ఈరోజు ఆమె విశాఖ జిల్లాలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిలో వెనుకబాటు, అప్పులు చేయడంలో రాష్ట్రం అగ్రగామిగా మారిందని విమర్శించారు. జీవీఎంసీలో ఆస్తులు కుదువపెట్టి అప్పులు తెచ్చుకుంటారా అని ఆమె ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని విమర్శించారు.
రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు చేస్తున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. కేంద్రం రోడ్ల అభివృద్ధికి నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం గుప్పెడు మట్టి కూడా వేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేదిస్తుందని పురందేశ్వరి అన్నారు. ఎంపీకే రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆమె చెప్పారు. విశాఖ స్టీల్ప్లాంట్కు ఉన్న భూమి అమ్మబోమని స్పష్టం చేశారు.