Pawan Kalyan on YS Jagan | ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని కొనసాగింపుపై సీఎం వైఎస్ జగన్ సరికొత్త నాటకానికి తెర తీశారని జనసేనాని అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. అధికార వికేంద్రీకరణకు ప్రతిపాదించిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
అయితే మూడు రాజధానులపై మరింత స్పష్టతతో కొత్త బిల్లు ప్రవేశపెడతామనడంతో సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో విమర్శించారు. అమరావతిపై హైకోర్టుల్లో విచారణ జరుగుతున్న 54 కేసుల్లో ఓటమి తప్పదన్న భయంతోనే మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల రద్దు ఏపీ సర్కార్ ఉపక్రమించిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడేండ్లవుతున్నా రాజధాని ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితిని ఈ పాలకులు తీసుకొచ్చారని అసహనం వ్యక్తం చేశారు.
అధికార వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పాలకులు ఉదాహరణలుగా చూపుతున్న వివిధ రాష్ట్రాల్లో రెండు, మూడు రాజధానుల్లేవనే సంగతి విస్మరించారని ఆక్షేపించారు. ఇప్పటికీ మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందన్న భ్రమలోనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మునిగి తేలుతున్నారని వ్యాఖ్యానించారు.