తాడేపల్లి: ఇప్పటికే కొత్త వారితో మంత్రిమండలిని సిద్ధం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. 2024 లో జరుగనున్న ఎన్నికలకు తమ పార్టీ నేతలను సంసిద్ధులుగా చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు పలువురు సీనియర్ నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. పలువురు నేతలకు బాధ్యతలను మార్చారు. ఇదే నేపథ్యంలో పార్టీలో జగన్ వెన్నంటే ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి కీలక పదవులు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ రీజనల్, జిల్లా అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల కో-ఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు. గతంలోనే విజయసాయిరెడ్డి పార్టీ అనుబంధ సంఘాల కో ఆర్డినేటర్గా వ్యవహరించి అందరినీ ఒకతాటిపైకి తీసుకురావడంలో కృతార్థులయ్యారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేలు, మీడియా కో ఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం వీరి నియామకాలను ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.