ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పుష్ప అనే యువతి తనకు కాబోయే భర్త గొంతు కోసి, చంపేయాలన్న ప్లాన్ వేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే.. పుష్పకు ఈ పెళ్లి ఇష్టం లేకే ఇలా కత్తితో దాడి చేసిందని అనకాపల్లి డీఎస్పీ సునీల్ వెల్లడించారు. ఇదే విషయం తమ విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. రామా నాయుడు అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన నేపథ్యంలో పుష్ప అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారించారు. ఈ విచారణలోనే పుష్ప తన నేరాన్ని అంగీకరించిందని డీఎస్పీ తెలిపారు. పుష్పను అరెస్ట్ చేశామని, రిమాండ్కు తరలించామని డీఎస్పీ ప్రకటించారు.
అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కలిసి స్కూటిపై బయటికి వచ్చారు. వడ్డాది దగ్గర యువతి స్కూటీ ఆపింది. గిఫ్ట్ తీసుకొస్తానని చెప్పి షాపులోకి వెళ్లింది. ఏం కొన్నావని అబ్బాయి అడిగితే పుష్ప సమాధానం చెప్పలేదు. బండిని విశ్వశాంతి జ్యోతిర్మయి ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్లింది. బహుమతి ఇస్తాను.. కళ్లు మూసుకొమ్మని చెప్పింది. అబ్బాయి సరిగ్గా కళ్లు మూసుకోకపోవడంతో చున్నీ కూడా కట్టేసింది. తర్వాత ఆ షాపులో కొన్న కత్తితో అబ్బాయి గొంతు కోసింది. ఈ పెళ్లి ఇష్టం లేకే గొంతు కోశానని పుష్ప స్వయంగా ఆ అబ్బాయితో చెప్పింది అని డీఎస్పీ సునీల్ వెల్లడించారు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేక పుష్ప ఆత్మహత్య చేసుకుంటుందేమో అన్న అనుమానంతో ఆ యువకుడు ఆమె వెనకే వెళ్లాడు. అయితే.. యువకుడి రక్తస్రావాన్ని గమనించి, స్థానికులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారని డీఎస్పీ వెల్లడించారు. అయితే ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎస్పీ స్పష్టం చేశారు.