అమరావతి : అల్లూరి సీతారామరాజు సదా స్మరణీయుడని ,యావత్ భారతావనికి అల్లూరి స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాలను జాతికి వివరించడానికి ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. అల్లూరి జన్మించిన పుణ్యభూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని అందుకు ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు ఒక్క ప్రాంతానికి చెందినది కాదని దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారని అందులో అల్లూరి సీతారామరాజు ప్రముఖుల్లో ఒకరని అన్నారు. ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆంగ్లేయులను ఎదిరించారని తెలిపారు. అల్లూరి జననం నుంచి బలిదానం వరకు చేసిన పోరాటాలు అందరికీ తెలియాలని , ఆదివాసీల శౌర్యం, ధైర్యానికీ ప్రతీక అల్లూరి అని అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో యువకులు ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా యువకులు భారత దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు.
తన ప్రసంగంలో ఏపీలోని ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంత్, పొట్టి శ్రీరాములు, కందుకూరి వీరేశ లింగం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవలను కొనియాడారు. వీరుల స్వప్నాలను నెరవేర్చే బాధ్యత నయాభారత్ లో అందరిదని అన్నారు. ఆదివాసీలు తయారు చేస్తున్న 12 ఉత్పత్తులకు మాత్రమే కనీస మద్దతు ఉండగా తాము అధికారంలోకి వచ్చిన తరువాత 90 ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఆదివాసీలున్న జిల్లాల అభివృద్ధికి లాభం చేకూరేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన సంస్థలను నెలకొల్పుతున్నామని పేర్కొన్నారు.