అమరావతి: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు మరోసారి సీబీఐ నోటీసులు అందాయి. విచారణ నిమిత్తం సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. న్యాయవ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రావాలని ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తున్నది. గతంలో ఇదే కేసులో ఆమంచి కృష్ణమోహన్ సీబీఐ అధికారులు ఎదుట హాజరయ్యారు.
సీఆర్పీసీ 41 (ఏ) సెక్షన్ కింద అధికారులు ఈ నోటీసులు ఇచ్చినట్లు చెప్తున్నారు. విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీకి చెందిన ఆమంచి కృష్ణమోహన్.. ఇంతకుముందు చీరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
న్యాయవ్యవస్థను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత ఏడాది నవంబర్ నెలలో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఇదే కేసులో మరోసారి ఆమంచిని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నెల 22న హాజరుకావాలని సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.