హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): చిట్టీ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్టీపాడుకున్న వ్యక్తి నుంచే తొలుత బకాయి వసూలు చేయాలన్న నిబంధన ఏదీ లేదని, ఆ చిట్టీ పాటదారుకు ష్యూ రిటీ ఇచ్చిన వ్యక్తి నుంచి కూడా అప్పు మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. చిట్ పాటదారుతోపాటు ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి కూడా సమాన బాధ్యత ఉంటుందని తేల్చిచెప్పింది. డిప్యూటీ రిజిస్ట్రార్ జారీచేసిన రికవరీ సర్టిఫికెట్ సివిల్ కోర్టు డిక్రీతో సమానమని పేరొంటూ.. దాని ఆధారంగా ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి జీతాన్ని జప్తు చేసేందుకు గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో చిట్టీ పాటదారుకు ష్యూరిటీ ఇచ్చిన కే వెంకట రామారావు కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల తీర్పు చెప్పారు.