అమరావతి : విశాఖ స్టీల్ పరిరక్షణకు మూడు సంవత్సరాల క్రితం తాను ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్ ఆమోదించడం సాంకేతికంగా చెల్లదని టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు (Ganta Srinivas Rao) అన్నారు. రాజీనామాను స్పీకర్ (Speaker) ఆమోదించడంపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నానని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లను కైవం చేసుకోవడానికి వైసీపీ పన్నిన కుట్రలో భాగంగానే తన రాజీనామాకు నేడు ఆమోదం తెలుపడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సీట్లు గెలిచేందుకు వైసీపీకి అవకాశాలుండగా మూడో స్థానాన్ని టీడీపీకి దక్కకుండా చేయడానికి రాజకీయ విలువలను పక్కన పెట్టి రాజీనామాను ఆమోదించారని దుయ్యబట్టారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఏనాడు కూడా ప్రధాని మోదీతో మాట్లాడక పోవడం వల్ల వేలాది మందికార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రధానితో జగన్ గట్టిగా మాట్లాడలేకపోయారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని విశాఖ బ్లాస్ట్ ఫర్నేస్లో వేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.