తిరుమల : ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై 9వ విడత బాలకాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా సాగింది. శుక్రవారం ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు వేద పండితులు 172 శ్లోకాలను పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి మాట్లాడుతూ రామనామం సకలశుభకరమన్నారు. శ్రీరాముడు కుమారునిగా, మహారాజుగా, భర్తగా, సోదరునిగా, తండ్రిగా ఆదర్శప్రాయుడన్నారు.
బాలకాండలోని శ్లోకాలను, విషూచికా మహమ్మారి నివారణ మంత్రమును ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో కోట్లాది మంది ప్రజలు ఒకేసారి పారాయణం చేస్తే ఫలితం అనంతంగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు ఉదయభాస్కర్ బృందం రామనామ సంకీర్తనలను ఆలపించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు.