కొన్నేళ్ల క్రితం వరకు ఇంటిని శుభ్రం చేయడానికి తాటి, ఈత పొరకలు (చీపుర్లు) వాడేవాళ్లు. క్రమంగా వాటి స్థానంలో కొబ్బరి పుల్లలతో చేసే చీపుర్లు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా, మెత్తని టైగర్ గ్రాస్ పొరకలే కనిపిస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అందరూ వినియోగిస్తున్నారు. దీంతో ఈ పొరకల తయారీకి వాడే టైగర్ గ్రాస్కు గిరాకీ పెరిగింది. సాగుకు పనికిరాని భూముల్లో టైగర్ గ్రాస్ను పెంచితే, మంచి ఆదాయం వస్తుందని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు.
పొరకల తయారీలో..
పొరకలు (చీపుర్ల) తయారీలో టైగర్ గ్రాస్ (కంచె గడ్డి)ను వాడుతున్నారు. దీని శాస్త్రీయ నామం ‘థైసానోలేనా ల్యాటిఫోలియా’. ఒకప్పుడు ఈ మొక్కలు పొలం బాటల వెంట, కాలువ గట్లు, తేమ కలిగిన మైదాన ప్రాంతాల్లో సహజసిద్ధంగానే పెరిగేవి. వీటిని ఎవరూ సాగు చేసేవాళ్లు కాదు. అయితే, ప్రస్తుతం ఈ గడ్డితో భారీ స్థాయిలో చీపుర్లు తయారు చేస్తుండగా, ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. స్థానికంగా ఉత్పత్తి లేకపోవడంతో ధర ఆకాశాన్నంటుతున్నది. పొరక తయారీదారులు అస్సాం, నేపాల్ నుంచి ఈ టైగర్ గ్రాస్ను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది.
ఒక్కసారి నాటితే..
ఈ తరహా గడ్డి పొదలు తెలంగాణలో ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. హైదరాబాద్లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కులో దట్టంగా పెరిగి కనిపిస్తాయి. వీటి పూలు చీపురు పుల్లలా ఉంటాయి. విశాఖ ఏజెన్సీలోనూ ఇవి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ టైగర్ గ్రాస్ మొక్కలు నర్సరీల్లో లభ్యమవుతాయి. ఒక్కసారి నాటితే చాలు. ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. ఇవి ఎప్పటికీ పెరుగుతూ, చుట్టూ విస్తరిస్తూ ఉంటాయి. మొదటి సంవత్సరం నుంచే పూర్తిస్థాయిలో పూత వస్తుంది. ఈ పూల కాడలను కోసి, ఎండబెట్టి చీపుర్ల తయారీలో వాడుతారు. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి ఏపుగా పెరుగుతాయి. జనవరి – మార్చి మధ్యలో పూతకు వస్తాయి.
ఆదాయ మార్గాలు..
టైగర్ గ్రాస్ను సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. విలువైన ఈ గడ్డి మొక్కలను వ్యవసాయానికి పనికిరాని భూములు, చెరువులు, కట్టలు, వాగు అంచుల్లో నాటుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా ప్రతి గ్రామంలో కనీసం 10 నుంచి 20 కుటుంబాలు ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.