మిడ్జిల్, జూన్19: వ్యవసాయం చేయడానికి ఈతరం వాళ్లు అంతగా ఆసక్తి కనబర్చరు. ఉన్న రెండు, మూడు ఎకరాల్లో సాగు చేయడం దండగే అనేవాళ్లు ఉన్నారు. అయితే మార్కెట్ అంచనాలను గమనిస్తూ డిమాండ్ తగ్గ పంటలు వేస్తే వ్యవసాయం పండుగే అని నిరూ పిస్తున్నాడు మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు డోల హనుమంతు. ఆధునికి పద్ధతుల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. ప్రత్యామ్నాయ సాగు వైపు చూడాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో అదే బాటలో నడిచి మంచి ఫలితాలు సాధిస్తున్నాడు.
తనకున్న 10ఎకరాల పొలంలో ప్రసుత్తం 4ఎకరాల్లో వరి, రెండు ఎకరాల్లో టమాట సాగు, మునుగ కాయ, మిర్చి పంటలు పండిస్తున్నాడు. పంటల సాగు కోసం డ్రిప్ విధానంలో మొక్కలకు సరిపడా నీళ్లు అందడంతో నీటి వృథా కూడా ఉండదు. ఇక బెడ్ పద్ధతిని వినియోగించడం వల్ల మొక్కకు గాలి, వెలుతురు సమృద్ధిగా అందడంతో అధిక దిగుబడులకు వస్తాయని తెలిపారు. అత్యాధునిక సేద్యపు పద్ధతులు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు రైతులకు వ్యవసాయాన్ని లాభాసాటిగా మారుస్తున్నారు.
మంచి డిమాండ్ ఉన్నది
నాకున్న పొలంలో టమాట, మిర్చి, మునగకాయ, క్యాబేజీ వంటి కూరగాయలను సాగుచేస్తున్నా. ప్రతి రోజూ కూరగాయలను తెంపి మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తా. తాజాగా ఉండటంతో మంచి ధర కూడా లభిస్తుంది. ప్రసుత్తం ఎకరా పొలంలో టమాట సాగు చేశా. పెట్టుబడి రూ.30వేలు కాగా లాభం రూ.4లక్షలు వచ్చింది.
– డోల హనుమంతు, కొత్తపల్లి, మిడ్జిల్