ప్రస్తుతం పండ్లతోటల్లో ఎక్కువ లాభాలను అందిస్తున్నది దానిమ్మ పంట. అయితే, ఎండు తెగులుతో ఈ పంటకు తీవ్రమైన నష్టం వాటిల్లుతున్నది. మొక్కలను పూర్తిగా నిర్వీర్యం చేసే ఈ తెగులు.. పండ్లతోటల రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.
భూమిలో ఉండే శిలీంధ్రాల ద్వారా దానిమ్మ తోటల్లో ‘ఎండు తెగులు’ వ్యాపిస్తుంది. మొక్కల వేర్లను ఆశించే నులిపురుగులు, వేర్లు, కొమ్మలపై రంధ్రాలు చేసే రంపపుపొట్టు పురుగులు చేసే రంధ్రాల ద్వారా.. శిలీంధ్రాలు మొక్కలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా మొక్కల ఆకులు పసుపురంగులోకి మారి, వాడినట్లుగా కనిపిస్తాయి. క్రమంగా గోధుమ రంగులోకి మారి.. ఎండి రాలిపోతాయి. తెగులు వ్యాపించిన మొదట్లో మొక్కలు బలహీనంగా మారి, క్రమేపి ఆకులు రాలిపోతూ ఉంటాయి. కొన్ని వారాల్లోనే మొక్క పూర్తిగా ఎండిపోయి, చనిపోతుంది.
నివారణ చర్యలు : దానిమ్మ తోట వేయాలనుకునే రైతులు.. నాణ్యమైన, ఆరోగ్యమైన మొక్కలనే నాటుకోవాలి. ఇందుకోసం పేరొందిన నర్సరీల నుంచి మాత్రమే మొక్కలను కొనుగోలు చేయాలి. నాణ్యత కోసం ధరలో రాజీ పడొద్దు.