Agriculture | మాఘి జొన్న, తెల్లజొన్న, ఎర్రజొన్న, పచ్చజొన్న.. ఒకప్పుడు మన పల్లెల్లో విరివిగా కాసిన ఈ జొన్న పంట కాలక్రమంలో కనుమరుగైపోయి.. ‘ముళ్ల జొన్న’గా సరికొత్త రూపంలో మళ్లీ వచ్చింది. అనుకూలమైన నేలలు, తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే ఈ పంటను ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో వందల ఎకరాల్లో సాగు చేస్తుండగా ఇప్పుడు మన దగ్గరా ప్రయోగాత్మ కంగా సాగవుతోంది. విత్తన కంపెనీ ప్రోత్సాహంతో ఎల్కతుర్తి మండల రైతులు ఏడెకరాల్లో పంట వేయగా ప్రస్తుతం ఏపుగా పెరిగి కోతకు వచ్చింది. ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పంటకు క్వింటాల్కు రూ.4వేల ధర చెల్లించనుండగా తొలిపంట విజయవంతమైతే వచ్చే యాసంగిలో వరి, మక్కజొన్న కన్నా జొన్న సాగే మేలని రైతాంగం భావిస్తోంది.
జిల్లా వ్యవసాయ యవనికపై మరో కొత్త పంట ఆవిష్కృతమైంది. ప్రపంచానికే విత్తన భాండాగారంగా ప్రసిద్ధికెక్కిన మన ప్రాంతం మరో విత్తన పంట పండించేందుకు రైతాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వందల ఎకరాల్లో రైతులు పండిస్తూ లాభాలు గడిస్తుండగా ఇప్పుడు హనుమకొండ జిల్లాలోనూ రైతులు ఈ పంట సాగు మొదలుపెట్టారు. రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు మనం పండించి మరిచిపోయిన జొన్న పంట ఇప్పుడు సరికొత్త రూపంలో మళ్లీ మన ముందుకొచ్చింది. ముళ్లజొన్న పేరుతో వచ్చిన ఈ పంటను ఎల్కతుర్తి మండలంలోని జీల్గుల, జగన్నాథపూర్ గ్రామాల్లో ఏడెకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. ప్రోలైన్ అనే సీడ్ కంపెనీ బైబ్యాక్ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు మొదలుపెట్టింది. మొదటి పంటగా సాగుచేస్తున్న పంట విజయవంతంగా దిగుబడి వచ్చినట్లయితే వచ్చే యాసంగి లో రైతులకు లాభదాయకంగా ఉన్న ఈ పంట వైపు అనేక మంది రైతులు మొగ్గుచూపే అవకాశం ఉంది.
సోర్ఘం అనే నామంతో పిలిచే ఈ జొన్న పంట 30 దేశాల్లో పండిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ల మంది జొన్నలను మాత్రమే ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. సింధూ నాగరికతతో సమాంతరంగా కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాల్లో పూర్వకాలంలోనే జొన్నలను పెద్ద ఎత్తున పండించినట్లు చరిత్ర చెబుతోంది. 20 ఏండ్ల క్రితం వరకు మనదేశంలో 15లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలు పండిస్తే అది ఇప్పుడు కేవలం 7లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయినట్లు అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్) పేర్కొంది. అయితే జొన్న పంట అనేక రూపాంతరాలు చెందుతూ రకరకాల రంగుల్లో సాగవుతోంది. ముఖ్యంగా మాఘి జొన్న, పచ్చ జొన్న, ఎర్రజొన్న, తెల్లజొన్న ఇంకా అనేక రకాల్లో జొన్నను రైతులు పండిస్తారు. నగేరియా, అమెరికా, ఇథియోపియా, ఇండియా, అర్జెంటీనా, చైనా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ఈ జొన్న పంట విస్తృతంగా పండుతుంది. అనేక దేశాల్లో వీటిని నేరుగా తినడంతో పాటు పలు తినుబండారాల్లోనూ వినియోగిస్తారు. ప్రపంచంలో పాడి ఉత్పత్తిలోనూ జొన్న కీలక పాత్ర పోషిస్తున్నది.
ఇప్పుడు ముళ్ల జొన్నగా..జొన్న పంట అనేక రూపాంతరాలు చెందుతూ ఇప్పుడు ముళ్ల జొన్నగా వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే బహుళ ప్రాచుర్యం పొందింది. ప్రతి యాసంగిలోనూ విరివిగా సాగు చేస్తున్నారు. మన వాతావరణం, భూములు కూడా ఈ పంటకు అనుకూలంగా ఉండడంతో ప్రోలైన్ అనే విత్తన కంపనీ ఇక్కడికి ఈ పంటను తీసుకొచ్చింది. ఎల్కతుర్తి మండలంలో ఏడెకరాల్లో సాగు చేస్తున్నారు. ఏపుగా పెరిగి మంచి దిగుబడి అంచనా కనిపిస్తోంది. మరోవారం, పది రోజుల్లో కోతకు వస్తుంది. దీని కంకి చుట్టూరా అత్యంత పదునుతో సన్నని ముండ్లు ఉండడంతో పిట్టలు దీనిపై వాలవు. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాలుకు రూ.4వేల చొప్పున విత్తన కంపెనీ కొనుగోలు చేస్తుంది. సాధారణ హార్వెస్టర్తోనే ఈ పంటను కోయవచ్చు. ఈ పంటకు చీడపీడలు కూడా తక్కువేనని.. కేవలం మూడు నీటి తడులతో పంట కాలం పూర్తవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దిగుబడిలో గనుక విజయవంతం అయినట్లయితే మక్కజొన్న, వరికి ప్రత్యామ్నాయంగా పండించవచ్చంటున్నారు.
నేను ప్రతీసారి యాసంగిలో మక్కజొన్న వేస్తా. ఈసారి సీడ్ కంపినోళ్లు వచ్చి కొత్త పంట ఒక్కసారి వేసి చూడు అని చెప్పారు. వాళ్లను నమ్మి నేను ఈ జొన్న పంటను వేశాను. ఇప్పటివరకైతే మంచిగనే ఉంది. పంట కోసిన తర్వాత దిగుబడి సుత బాగనే వస్తుందనుకుంటున్న. ఈసారి అక్కెరకు వస్తే వచ్చే సంవత్సరం కూడ వేస్తా, మక్కజొన్న కంటే నయంగానే కనవడుతాంది.
– గూళ్ల వెంకటయ్య, రైతు
జొన్న పంట పండిస్తే మంచి లాభాలు వస్తాయి. ప్రపంచ దేశాల్లో ఈ జొన్నలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఎన్ని వందల ఎకరాలైనా విత్తనం ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. మళ్లీ మేమే కొనుగోలు చేస్తాం. ఈ పంట పశుగ్రాసంగా కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ నీరుతో ఎక్కువగా లాభం పొందవచ్చు. మక్కజొన్న, వరి కంటే ఎక్కువగా డబ్బులు వస్తాయి. – గీసిడి కొండాల్రెడ్డి, సీడ్ ఆర్గనైజర్