అపరాల (పప్పు జాతి) పంటలకు నత్రజనిని అందించే ‘రైజోబియం’ను జీవ ఎరువుగా వాడాలి. కంది, పెసర, మినుము, శెనగతోపాటు వేరుశెనగ, సోయా చిక్కుడు విత్తనాలు విత్తేముందు ‘రైజోబియం కల్చర్’ను పట్టించాలి. దీనివల్ల మొక్క వేర్లపై లేత గులాబి రంగులో బుడిపెలు ఏర్పడుతాయి. ఈ బుడిపెల్లోని రైజోబియం.. గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. అయితే, రైతు ఏ పంట వేస్తాడో ఆ పంటకు నిర్దేశించిన రైజోబియంను మాత్రమే వాడాలి.
వంద మిల్లీ లీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడరును కలిపి, 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ ద్రావణాన్ని 10 కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని చేర్చాలి. ఈ ‘రైజోబియం పొడి’ ప్రతి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేలా చూసుకోవాలి. ఆ తర్వాత విత్తనాలను 10 నిమిషాలపాటు నీడలో ఆరబెట్టి, పొలంలో నాటుకోవాలి.
ఇది చెరకు, బీట్రూట్ వంటి పంటలకు అనుకూలం. నత్రజని జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది. నేరుగా మొక్కల వేర్లలోనేగాక పైభాగాన కూడా జీవించి నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. అంతేకాక, ఎన్ఏఏ అనే హార్మోన్ను అధికంగా ఉత్పత్తి చేసి మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది.