లాభాలు కురిపిస్తున్న దసలి పట్టు పురుగుల పెంపకం
ఉపాధి పొందుతున్న గిరిజనం
ప్రకృతిసిద్ధంగా లభించే దసలి పట్టుతో.. ఆదివాసీ గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. పట్టుపురుగుల పెంపకం ద్వారా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో సబ్సిడీలు పొందుతూ.. పెట్టుబడులు లేకుండానే లాభాల బాట పడుతున్నారు. ఏడాదిలో సగం రోజులు చేతి వృత్తులు.. మరో సగం రోజులు పట్టు పురుగుల పెంపకంతో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మరోవైపు పట్టుపురుగు విత్తనాల (గుడ్లు) ఉత్పత్తితో.. పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలోని అడవుల్లో ఏరుమద్ది, నల్లమద్ది చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి దసలి పట్టుపురుగుల పెంపకానికి అనువుగా ఉంటాయి. దీంతో ఇక్కడ దసలి పట్టుపురుగుల విత్తనాలు ఉత్పత్తి చేసేలా స్థానిక రైతులను పట్టు పరిశ్రమ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. పట్టుపురుగుల పెంపకంపై శిక్షణ ఇచ్చి, ఉచితంగా గుడ్లను అందిస్తున్నారు. ఈక్రమంలో వందల సంఖ్యలో రైతులు మద్దిచెట్లమీద పట్టు పురుగులను పెంచుతూ.. మంచి లాభాలు అందుకుంటున్నారు. మిగతా రోజుల్లో కులవృత్తులు, ఇతర పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.
100 ఎకరాల విస్తీర్ణంలో..
అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజన, ఆదివాసీ రైతులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం దసలి పట్టుపురుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో 1985లో దసలి పట్టు పరిశ్రమను స్థాపించారు. ఇక్కడ 100 ఎకరాల్లో ‘టస్సర్ ఫామ్’ను ఏర్పాటు చేసిన పట్టు పరిశ్రమ శాఖ, భూమిలేని రైతులను గుర్తించి దసలి (పట్టు) కాయలను పండించే విధానంపై శిక్షణ ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు వెయ్యి మంది రైతులు 7,500 ఎకరాల్లో టస్సర్ (దసలి) పంటను పండిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో దాదాపు 400 మంది రైతులు దసలి పట్టుకాయలను పండిస్తూ ఉపాధి పొందుతున్నారు. దసలి పట్టుకాయ 45 రోజుల్లో చేతికి వస్తుంది. రైతులు ఏడాదికి మూడు పంటలు తీసే అవకాశం ఉన్నది. స్థానిక 100 ఎకరాల నర్సరీలో పట్టు పురుగులకు సంబంధించి ప్రాథమిక విత్తనాల (బేసిక్ న్యూక్లియస్ సీడ్)ను ఉత్పత్తి చేస్తున్నారు.
పట్టులో రకాలు..
పట్టుపురుగుల్లో మల్బరీ, దసలి, మెగాసిల్క్, ఎరి సిల్క్, ఓక్ టస్సర్ అని ఐదు రకాలున్నాయి. మొదటి రకం.. మల్బరీ పట్టుపురుగులు. ఇవి మల్బరీ ఆకులను తిని గూళ్లను అల్లుతాయి. పంట పొలాలు, పట్టా భూముల్లో రైతులు వీటిని సాగు చేస్తున్నారు. రెండో రకం.. దసలి పట్టు పురుగులు. టస్సర్ సిల్క్నే దసలి అని అంటారు. టస్సర్ సిల్క్ను తొమ్మిది రాష్ర్టాల్లో పండిస్తున్నారు. ఈ రాష్ర్టాలన్నిటికీ కలిపి దసలి పట్టుపురుగులకు సంబంధించిన కార్యాలయాన్ని బేసిక్ టస్సర్ సిల్క్ హోం సీడ్ ఆర్గనైజేషన్ (బీటీహెచ్ఎస్వో) అంటారు. మరో రకం.. మెగాసిల్క్. ఇది ఈశాన్య రాష్ర్టాల్లో పండుతుంది. నాలుగు, ఐదు రకాలైన ఎరిసిల్క్, ఓక్ టస్సర్ ఈశాన్య రాష్ర్టాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడి ప్రజలు ఎరిసిల్క్ రకాలను ఇంట్లోనే సాగు చేసుకుంటారు. ప్యూపాను ఆహారంగా తీసుకుంటారు. పట్టును శాలువాలు, చద్దర్లు డెనిమ్ జీన్స్ల తయారీలో వాడుతారు. పట్టు పురుగుల్లో మల్బరీ, దసలి, మెగాసిల్క్ ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటాయి.
ఆర్థిక తోడ్పాటు..
దసలి పట్టుపురుగుల ముఖ్య ఆహారం ఏరుమద్ది (తెల్లమద్ది), నల్లమద్ది చెట్లు. వీటిని ప్రైమరీ ఫుడ్లాండ్స్గా వ్యవహరిస్తారు. దసలి పట్టుపురుగులు వీటి ఆకులను ఆహారంగా తీసుకొని పట్టు గూళ్లను అల్లుతాయి. చెన్నూర్లో పట్టు పరిశ్రమ శాఖ నిర్వహిస్తున్న 100 ఎకరాల నర్సరీలో లక్షా 50 వేల ఏరుమద్ది, నల్లమద్ది మొక్కలను పెంచుతున్నారు. అదేవిధంగా చెన్నూర్ టస్సర్ శాఖ కార్యాలయం ద్వారా దసలి పట్టు మూల విత్తనాన్ని (బేసిక్ సీడ్ను), న్యూక్లియస్ విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విత్తనాలను స్థానికంగా అడవిమీద ఆధారపడి జీవించే గిరిజనులకు సరఫరా చేస్తున్నారు. సాంకేతికంగానూ చేదోడువాదోడుగా ఉంటూ, పట్టుపురుగుల పెంపకంలో అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక గిరిజనులు దసలి పంట ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఏడాదికి రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు. సాధారణంగా పట్టుపురుగుల సీజన్ జూన్ నెల నుంచి డిసెంబర్ వరకూ ఉంటుంది. ఈ ఆరు నెలలు వారు పట్టుపురుగులను పెంచుతారు. మిగతా సమయంలో చేతివృత్తుల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. చెన్నూర్ చుట్టు పక్కల సుమారు 400 కుటుంబాలు దసలి పట్టు పురుగుల మీద ఆధారపడి జీవిస్తున్నారు.
పెట్టుబడి తక్కువే..
దసలి పట్టుపురుగు కాయకు పెట్టుబడి ఎక్కువగా అవసరం లేదు. రూ.3 వేలతో గుడ్లను కొనుగోలు చేస్తే సరిపోతుంది. పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలోనే గుడ్లను సబ్సిడీ కింద అందిస్తున్నది. అయితే, ఈ గుడ్లు పిల్లలు అయ్యేవరకూ జాగ్రత్తగా కాపాడుకోవాలి. గుడ్ల నుంచి పట్టుపురుగులు బయటికి వచ్చిన తర్వాత వాటిని ఏరుమద్ది, నల్లమద్ది చెట్లపై వేస్తారు. పట్టుపురుగులు ఆకులను తింటూ 20 రోజులకు దసలి పట్టుకాయలుగా మారుతాయి. ఈ సమయంలో పట్టుపురుగులను పక్షులు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు నెలలపాటు కష్టపడితే కాయ చేతికి అందుతుంది. ఒక్కో రైతు 20 వేల నుంచి 30 వేల కాయలు పండిస్తారు. వీటి ద్వారా ఏడాదికి పెట్టుబడులు పోను రూ. 70 వేల నుంచి రూ.80 వేల దాకా ఆదాయం ఆర్జిస్తున్నారు.
పట్టుపురుగుల పంట..
పట్టుగుడ్ల నుంచి వచ్చే లార్వా (గొంగళి పురుగు)ను నల్లమద్ది, తెల్లమద్ది చెట్లపై వదులుతారు. ఈ పురుగులు చెట్ల ఆకులను తింటూ, 25 నుంచి 30 రోజుల్లో పెద్దగా పెరుగుతాయి. ఆ తర్వాత ఆ చెట్లమీదే పట్టుగూళ్లను అల్లుతాయి. గూళ్లు పూర్తిగా తయారైన తర్వాత స్థానిక గిరిజనులు వాటిని సేకరిస్తారు. దండలుగా కట్టి, షేడ్నెట్లో పరిరక్షిస్తుంటారు. కాయ అల్లిన 15 నుంచి 20 రోజుల తర్వాత వాటిలోంచి మాత్ (పెద్ద సీతాకోక చిలుక) బయటికి వస్తాయి. అక్కడే ఆడ, మగ మాత్లు కలుస్తాయి. తర్వాత ఆడ మాత్ గుడ్లు పెడుతుంది. ఇలా పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో విత్తనాలను (గుడ్లను) ఉత్పత్తి చేస్తూ.. తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తారు.
అదనపు ఆదాయం..
చెన్నూర్లో పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో 100 ఎకరాల విస్తీర్ణంలో లక్షా 50 వేల మొక్కలు ఉన్నాయి. ఈ చుట్టు పక్కల సుమారు 400 కుటుంబాలు దసలి పట్టుపురుగుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. చెన్నూర్లోని దసలి పట్టుపురుగుల విత్తనోత్పత్తి కేంద్రంలో ఏటా 2 లక్షల 50 వేల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. గతేడాది 1000 కాయలు రూ.3,800 ధర పలికింది. తుఫాన్లు, వరదలతో కాయలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో పంట సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. ఇక్కడ ప్రకృతిసిద్ధంగా దసలి పట్టుపురుగులను పెంచడంతో రేటు బాగా పలుకుతున్నది.
– హనుమాండ్లు, ఏడీ.
పట్టు పరిశ్రమ శాఖ, చెన్నూర్.
…? కొమ్మెర రామమూర్తి