ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో అడవి పంది దాడి ( Wild Boar Attack ) లో ఒకరికి గాయాలయ్యాయి. తేజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సాలేగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు, తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు మడావి కోసేరావ్ ( Madavi Koserao ) తన వ్యవసాయ భూమిలోని పంటకు మందు పిచికారి చేయడానికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన అడవి పంది అతనిపై దాడి చేసింది. దీంతో అతడు కిందపడి లేచే ప్రయత్నంలో మరోసారి వేగంగా వచ్చి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిందని బాధితుడు తెలిపారు.
గాయపడ్డ మడావి కోసేరావును స్థానికులు ప్రైవేటు ఆసుపత్రి వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న తేజాపూర్ సర్పంచి కోవా రాజేశ్వర్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క చిత్రు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, మాజీ ఎంపీటీసీ కనక హనుమంతు, విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు గేడం లాలు ప్రసాద్, నాయకులు గణేష్ గాయపడిన మడావి కోసేరావ్ ను పరామర్శించారు.