ఖానాపూర్: విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు సకాలంలో వారి ఖాతాల్లో జమా అయ్యేలా బ్యాంకు ఖాతాల ( Bank Accounts ) ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయాలని లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామ్ గోపాల్ (DM Ram Gopal ) బ్యాంకర్లకు సూచించారు.
2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఖానాపూర్ ఉమ్మడి మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం శుక్రవారం ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రైతు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల పునరుద్ధరణ, స్వయం సహాయక సంఘాల బ్యాంకు అనుసంధానం, వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సుదీర్ఘంగా సమీక్షించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెస్ పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం, ముద్రా, ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకాల అమలు, వాటికి సంబంధించిన సాంకేతిక మద్దతు విధానాలను బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులకు వివరించారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుమారు 2 వేల కొత్త బ్యాంకు ఖాతాలను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులు, బ్యాంకు మేనేజర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.