బజార్హత్నూర్, జనవరి 9 : గ్రామాల్లో స్వచ్ఛ సంకల్పం పటిష్టంగా అమలవుతున్నది. అధికారుల పర్యవేక్షణతో పంచాయతీ కార్మికులు ప్రతి రోజూ గ్రామాల్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుతున్నారు. సేకరించిన చెత్తాచెదారాన్ని పంచాయతీ ట్రాక్టర్లో డంప్యార్డుకు తరలిస్తూ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. గతంతో పోలిస్తే ప్రజల భాగస్వామ్యం పెరిగింది. ప్రభుత్వం ప్రతి 1000 మంది జనాభాకు ఒక పారిశుధ్య కార్మికుడిని నియమించి గౌరవ వేతనం పంచాయతీ ద్వారా అందిస్తున్నారు.
అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ పారిశుధ్య పనులతో పాటు డ్రైనేజీ నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం ఆయా గ్రామాల్లోని సర్పంచ్లు వీధులగుండా తిరుగుతూ పంచాయతీ సిబ్బందితో పరిసరాలు శుభ్రం చేయిస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది పేరుకుపోయిన చెత్తాచెదారంతో పాటు మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోని ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు.
ఇళ్లల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా పంచాయతీ ట్రాక్టర్లో వేస్తున్నారు. ఇళ్లల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉంచవద్దని పంచాయతీ కార్యదర్శులు ప్రచారం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో నిర్వహించే స్వచ్ఛ శుక్రవారాల్లో కాకుండా నిత్యం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మురుగు కాలువల వెంట బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమలను నివారించి దుర్గంధంను దూరం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రధానరోడ్లు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని బాటసారులు, వాహనదారులు, ప్రయాణికులు చెబుతున్నారు. పారిశుధ్య పనులపై మండల స్థాయి అధికారులు ఎప్పటిప్పుడు పర్యవేక్షిస్తూ గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యం దిశగా కృషి చేస్తున్నారు.
గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంచాయతీ సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి కార్మికులు చెత్తసేకరణ చేపట్టడంతో స్వచ్ఛ గ్రామాలుగా మారుతున్నాయి.
రాథోడ్ రాధ, ఎంపీడీవో, బజార్హత్నూర్
గ్రామాల్లో చెత్త సేకరణ పక్కాగా అమలవుతుంది. పంచాయతీ కార్మికులు చెత్తను సేకరించి డంప్యార్డులో వర్మీ కంపోస్టు ఎరువుల తయారీకి చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజూ పరిసరాలను కార్మికులు శుభ్రం చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో శుభ్రత నెలకొంది.
తడక దయాకర్, బజార్హత్నూర్ గ్రామవాసీ