ఎదులాపురం, ఫిబ్రవరి16: అవకాశాలను అందిపుచ్చుకుంటూ యువత ఉన్నతంగా ఎదగాలని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ సూచించారు. టెలికాం ఇండస్ట్రీలోని పలు కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో గురువారం జాబ్ మేళా ఏర్పాటు చేశారు. జాబ్ మేళాకు యువత నుంచి స్పందన లభించింది. ఆయా కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతితో కూడిన వేతనాన్ని చెల్లించనున్నారు. ఈ సందర్భంగా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడారు. టెలికాం ఇండస్ట్రీలో అవసరమైన ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంపికైన వారికి హైదరాబాద్లో ఉద్యోగంతో పాటు ఉచితంగా వసతి కూడా కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉపాధిహామీ పనుల పరిశీలన
తలమడుగు, ఫిబ్రవరి 16 : మండలంలోని రుయ్యాడిలో చేపట్టిన ఉపాధిహామీ పనులను ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ గురువారం పరిశీలించారు. కూలీలకు సంబంధించిన పలు రికార్డులను చూశారు. మండలంలో 28 జీపీల్లో జరుగుతున్న పనుల వివరాలను ఉపాధిహామీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎలాంటి పనులు గుర్తించి చేస్తున్నారో తెలుసుకున్నారు. ఆమె వెంట సర్పంచ్ పోతారెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, ఉపాధి హామీ ఏపీవో మేఘమాల ఉన్నారు.