నమస్తే నెట్వర్క్ బృందం ; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. మామిడి, చింతకాయలు నేలరాలగా.. మక్క నేలకొరిగింది. పసుపు, వరి, జొన్న, నువ్వులు, శనగ, గోధుమ పంటలకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో ఇండ్లు దెబ్బతినగా.. గోడలు కూలాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అధికారులు క్షేత్రాలను పరిశీలిస్తుండగా.. బాధితులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
నిర్మల్ జిల్లాలో..
దస్తురాబాద్, మార్చి19: అల్పపీడన ప్రభావంతో కడెం, దస్తురాబాద్ మండలాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. వర్షం కారణంగా కరంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడికాయలు నేల రాలాయి. పలు పంటలకు తీవ్ర నష్టం కలిగించడంతో, రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
మండలంలోని బోరిగాం, గొడిసెర, ఆలూరు గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యం మక్క పంటపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అకాల వర్షం తమకు తీరని నష్టం మిగిల్చిందని రైతులు దిగాలు చెందుతున్నారు.
భైంసాటౌన్, మార్చి 19 : మండల వ్యాప్తంగా శనివారం రాత్రి అకాల వర్షం కురిసింది. పలు గ్రామాల్లో పంటలు నేలకొరిగాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
సోన్, మార్చి 19: సోన్ మండలంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు, అకాల వర్షంతో మక్క, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. మక్క పంట గింజ దశకు చేరుకున్నాక నేలకొరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోన్ మండల కేంద్రంతో పాటు పాక్పట్ల, మాదాపూర్, గంజాల్, కడ్తాల్, సిద్ధులకుంట, జాఫ్రాపూర్, తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
పెంబి, మార్చి 19: మండలంలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పెంబి, మందపల్లి గ్రామాల్లో మక్క పంట నేలకొరిగింది. మందపల్లి గ్రామానికి చెందిన రైతు సాయికుమార్ ఐదెకరాల్లో మక్క వేయగా, సుమారు 2.5 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. అధికారులు తన క్షేత్రాన్ని పరిశీలించి, న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు.
ఆదిలాబాద్ జిల్లాలో..
బోథ్, మార్చ్ 19: మండలంలో శనివారం కురిసిన వడగండ్ల వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులు వీయడంతో పంటలు నే లకొరిగాయి. బోథ్, ధన్నూర్ (బీ), కన్గుట్ట, సొనాల, కౌఠ (బీ), ఘన్పూర్, రాంనగర్ తదితర గ్రామాల్లోని గోధుమ, మక్క, ధనియా లు, టమాట తదితర పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వడ గండ్లతో మామిడి, చింత కాయలు పూర్తిగా నేలరాలాయి. యాసంగి కింద పండిస్తున్న పంటలకు ఈ స్థాయిలో అకాల వర్షాలతో నష్టం వా టిల్లలేదని రైతులు పేర్కొంటున్నారు. పలు గ్రామాల్లో ఇళ్లు దెబ్బ తిన్నాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడడంతో గోడలు, పైకప్పులు ఇళ్లు దెబ్బ తిన్నాయి
నేరడిగొండ మండలంలో..
నేరడిగొండ, మార్చి 19 : అకాల వర్షం అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని తేజాపూర్, కుమారి, తర్నం, నేరడిగొండ, బుద్దికొండ, వడూర్, కుంటాల, బుగ్గారం, వాగ్దారి తదితర గ్రామాల్లో శనివారం వడగండ్ల వాన కురిసింది. దీంతో మక్క, జొన్న, నువ్వు, శనగ, గోధుమ వంటి పంటలకు నష్టం కలిగింది.
పంటల పరిశీలన
మండలంలో వివిధ గ్రామాల్లో వడగండ్ల వానకు పంటలకు నష్టం కలగడంతో బోథ్ ఏడీఏ శ్రీధర్స్వామి, మండల వ్యవసాయాధికారి ఆదివారం పంట చేన్లను పరిశీలించారు. మండలంలోని కుమారి, కుప్టి గ్రామాల్లోని మక్క, జొన్న పంటలు వర్షానికి పూర్తిగా దెబ్బతినడంతో పరిలించారు. ఏడీఏ శ్రీధర్స్వామి మాట్లాడుతూ వడగండ్ల వానకు నేలవాలిపోయాయని తెలిపారు. ఆలస్యంగా విత్తనం వేసిన మక్క పం టకు తీవ్ర నష్టం జరిగినట్లు చెప్పారు. నష్టంపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని తెలిపారు. రైతులు వెంకటరమణ, భోజ న్న, గంగేశ్వర్, నాయుకలు చంద్రశేఖర్యాదవ్, పాల్గొన్నారు.