ఖానాపూర్ టౌన్, ఫిబ్రవరి 3 : ఖానాపూర్ గోదావరి పరీవాహక ప్రాంతం, సదర్మాట్ ప్రధాన కాలువ కింద రైతులు యాసంగి వరి నాట్లు జోరుగా సాగిస్తున్నారు. ఖానాపూర్, కడెం మండలాల జీవనాధారమైన సదర్మాట్ ప్రధాన కాలువకు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి యాసంగి సీజన్కు సరిపడా సాగునీటిని విడుదల చేశారు. దీనికితోడు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో వరి సాగు సంబురంగా కొనసాగుతున్నది. ఈ సీజన్లో ఖానాపూర్ మండలంలో 8,600 ఎకరాల్లో సాగు చేయగా.. సదర్మాట్ కాలువ కింద 2,200 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సదర్మాట్ అనకట్ట వద్ద ఆరు అడుగుల నీటిమట్టం ఉంది. నిత్యం 300ల క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టు చివరివరకు అందిస్తున్నారు. ప్రస్తుతం కాలువలో నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో ఆయకట్టు రైతులు ముమ్మరంగా వరి నాట్లు వేసుకునే పనుల్లో బిజీగా మారారు. ఏప్రిల్ చివరిలోగా కోత దశకు వచ్చే వరి పంటలను సాగు చేసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు సూచిస్తున్నారు.
పంట సాగుకు రైతు బంధు ఆసరా..
రైతులకు ప్రతి సీజన్లో పంట పెట్టుబడిని రాష్ట్ర సర్కారు అందిస్తున్నది. ఈ సీజన్లో వ్యవసాయ పనులు ప్రారంభం కాగానే.. నేరు గా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. గతంలో చిన్న, సన్నకారు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే వారు. తెచ్చిన అ ప్పులు అసలు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకంగా ఉండేవి. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి మారిపోయింది. సాగు సమయం లో రైతులు ఇబ్బంది పడకుండా సమయానుకూలంగా ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది. సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రూ.10 వేలు అందిస్తున్నది. ఈ యాసంగి సీజన్లో ప్రభుత్వం 10వ విడుతలో ఇప్పటి వరకు ఖానాపూర్ మండలంలోని 9,065 మంది రైతులకు రూ.7 కోట్ల 96 లక్షల 54 వేలు రైతుల బ్యాం కు ఖాతాల్లో జమ చేసింది. రైతు బంధు డబ్బు లు ఖాతాల్లో జమ కావడంతో రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. సర్కారు సాయంపై రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాటు కోసం భూమిని సిద్ధం చేసుకున్నా
నాకు సదర్మాట్ కెనాల్ దిగువన వరి పొలం ఉంది. ప్రస్తుతం వరినాటు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న. ప్రభుత్వం రైతుబంధు పథకంలో ఇచ్చిన డబ్బులతో ఇది వరకే విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసుకున్నా. నా భూమిని అన్ని విధాలా సాగుకు సిద్ధం చేసుకున్నా. ఈసారి ప్రణాళికతో వరి సాగు చేస్తున్నా. దిగుబడులు కూడా బాగానే వస్తాయని ఆశిస్తున్న. రైతు బంధు పైసలు ఖాతాలో జమ చేసిన సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– మడెంపెల్లి రాజన్న, రైతు, ఖానాపూర్
సాగుకు సరిపడా నీరందిస్తున్నాం..
ఖానాపూర్, కడెం మండలాల రైతులకు సాగునీరందించే సదర్మాట్ కాలువ కింద యాసంగి పంటలకు నీటి సమస్య ఉండదు. గోదావరి నీటి పారకంపై ఆధారపడి నిర్మించిన ఈ కాలువకు ప్రస్తుతం 300 క్యూసెక్కుల సాగు నీటిని దిగువకు విడుదల చేస్తున్నాం. పంట రైతుల చేతికి అందే వరకు నీటి విడుదల ఉంటుంది. అయితే రైతులు ఆలస్యం చేయకుండా సత్వరంగా వరినాట్లు పూర్తి చేసుకుంటే మేలు. ఆలస్యంగా నాటు వేసుకుంటే పంట చివరి దశలో సమస్యలు ఎదురుకావచ్చు. ఏప్రిల్ చివరి వారంలో కోత దశకు వచ్చే వరి పంటలను రైతులు సాగు చేసుకోవాలి.
– ఉదయ్కుమార్, ఏఈఈ, సదర్మాట్