నార్నూర్ : అనాథ పిల్లలను ( Orphan Children ) ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని అన్న బావు సాఠే కమిటీ జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంబ్లే ఉద్ధవ్ ( Kamble Uddav ) అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో అనాథ పిల్లలకు నిత్యావసర సరుకుల తోపాటు నూతన వస్త్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నెళ్ల క్రితం తల్లి గిరిజ బాయి మృతి చెందగా, తండ్రి డోంగ్రు రావ్ ఆగస్టు 15వ తేదీన మరణించినట్లు తెలిపారు. వీరికి నలుగురు సంతానం ఉండగా అందులో ముగ్గురు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రుల మృతితో నలుగురు పిల్లలు అనాథ అయ్యారని తెలిపారు.
మానవ దృక్పథంతో దాతలు ముందుకు వచ్చి పిల్లలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్ర జ్ఞానేశ్వర్, మాజీ సర్పంచ్ కోట్నాక్ కృష్ణ, దశరథ్, గ్రామ పెద్దలు ఉన్నారు.