వానకాలం, ఎండకాలం సీజన్లలో ధాన్యం దండిగా పండగా, ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్లను కొనుగోలు చేసిన సర్కారు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం మిల్లులకు అప్పగించింది. సకాలంలో ఆ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో మిల్లర్లపై సీరియస్ అయ్యింది. వానకాలంలో 63 శాతం, ఎండకాలం లో 31 శాతం మాత్రమే సీఎంఆర్ కింద పెట్టగా, ఈ నెలాఖరులోగా 100 శాతం లక్ష్యం పూర్తి చేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఇంకా తొమ్మిది రోజులే గడువు ఉండగా, యాజమాన్యాల్లో ఆందోళన కనిపిస్తున్నది.
మంచిర్యాల అర్బన్, జనవరి 22 : జిల్లాలో 2022-23లో ధాన్యం దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చాయి. ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు చేసిన అధికారులు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం పౌర సరఫరాల సంస్థ (సీఎస్సీ)కు, ఆహార భద్రత సంస్థ (ఎఫ్సీఐ)కు కేటాయించారు. మిల్లుల నుంచి వచ్చిన బియ్యాన్ని సివిల్ సప్లయ్, ఎఫ్సీఐ గోదాములకు తరలించి.. అక్కడి నుంచి నేరుగా రేషన్ లబ్ధిదారు లకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోలేదు.
2022-23 వానకాలం సీజన్లో పౌర సరఫరాల శాఖ (సివిల్ సైప్లె) డీఆర్డీఏ ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల ద్వా రా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇత ర జిల్లాల్లోని మిల్లులతో పాటు జిల్లాలోని 19 బాయిల్డ్, 35 రా రైస్ మిల్లులకు 1,19,177 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించారు. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మిల్లింగ్ చేసి 79,848(బాయిల్డ్ 38,517, రా మిల్లులు 41,331) మె ట్రిక్ టన్నుల బియ్యం సీఎస్సీ, ఎఫ్సీఐకి అం దజేయాల్సి ఉంది.
కానీ ఇప్పటి వరకు బాయి ల్డ్ రైస్ మిల్లర్లు 29,374 (బాయిల్డ్ 4,845 , రా రైస్ మిల్లులు 24,529) మెట్రిక్ టన్నులు బియ్యం పెట్టారు. బాయిల్డ్ మిల్లుల నుంచి ప్రభుత్వానికి 167 ఏసీకే(అక్నాలడ్జ్మెంట్.. 1 ఏసీకే అంటే 290 క్వింటాళ్లు)ల బియ్యం పెట్టాల్సి ఉండగా, రా రైస్ మిల్లులు 846 ఏసీకేల బియ్యం పెట్టాల్సి ఉంది. మొత్తంగా 1,013 ఏసీకేల బియ్యం పెట్టాల్సి ఉంది. జిల్లా మొత్తంగా ఇప్పటి వరకు 63 శాతం బియ్యం ప్రభుత్వానికి సీఎంఆర్ కింద పెట్టారు.
2022-23 ఎండకాలం సీజన్లో పౌర సరఫరాల శాఖ (సివిల్ సైప్లె) డీఆర్డీఏ ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల ద్వా రా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇత ర జిల్లాల్లోని మిల్లులతో పాటు జిల్లాలోని 19 బాయిల్డ్, 8 రా రైస్ మిల్లులకు 82,859 మె ట్రిక్ టన్నుల ధాన్యం అలాట్ చేశారు. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మిల్లింగ్ చేసి 56,344(బాయిల్డ్ 49,313, రా మిల్లులు 7,031) మె ట్రిక్ టన్నుల బియ్యం సీఎస్సీ, ఎఫ్సీఐకి అం దజేయాల్సి ఉంది.
కానీ ఇప్పటి వరకు బాయి ల్డ్ రైస్ మిల్లర్లు 17,639 మెట్రిక్ టన్నులు పెట్టగా, రా రైస్ మిల్లర్లు అసలు బియ్యమే పెట్టలేదు. బాయిల్డ్ మిల్లుల నుంచి ప్రభుత్వానికి 31,673 మెట్రిక్ టన్నులు అంటే 1092 ఏసీకేల బియ్యం పెట్టాల్సి ఉంది. రా రైస్ మిల్లులు 7,032 మెట్రిక్ టన్నులు అంటే 242 ఏసీకేల బియ్యం పెట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క ఏసీకే కూడా పెట్టలేదు. జిల్లా మొత్తంగా ఇంకా 38,705(బాయిల్డ్ మిల్లర్లు 31,673, రా మిల్లర్లు 7,032) మెట్రిక్ టన్నుల బియ్యం పెట్టాల్సి ఉంది. అంటే కేవలం 31 శాతం బియ్యమే ప్రభుత్వానికి పెట్టారు.
– గెడం గోపాల్, డీఎం సివిల్ సైప్లె కార్పొరేషన్
2022-23 వానకాలం, ఎండకాలంలో అనుకున్నదానికంటే రెట్టింపు ధాన్యం వచ్చింది. దీంతో మిల్లులన్నీ నిండుకున్నాయి. ఆ సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి తదితర జిల్లాల్లోని మిల్లులకు సైతం ధాన్యం పంపించాం. జిల్లాలోని మిల్లులకు సీజన్ల వారీగా కేటాయించిన ధాన్యానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలి. ఈ విషయమై ఇది వరకే మిల్లర్లకు తెలియజేశాం. గడువు దాటినా సీఎంఆర్ ఇవ్వని వారిపై చర్యలు తీసుకుంటాం. ఇంకా 9 రోజులే మిగిలి ఉంది. మిల్లర్లు గడువులోగా సీఎంఆర్ ఇవ్వాల్సిందే.