నస్పూర్, జనవరి 29 : ప్రజలు పౌర హక్కులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ఆ దిశగా సంబంధిత అధికారులు, జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఆర్డీవో రాములు, మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు తిరుపతిరెడ్డి, మోహన్, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ సంచాలకులు పోటు రవీందర్రెడ్డితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అట్రాసిటీ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, బాధితులకు సకాలంలో న్యాయం చేయాలని, చట్టంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. 2016 జిల్లా ఏర్పాటు అనంతరం ఇప్పటి వరకు 2012-22 వరకు వివిధ కేసుల్లో 447 మంది బాధితులకు రూ.4,75,44, 750 పరిహారం మంజూరు చేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యుల ప్రతిపాదన మేరకు మందమర్రి మండలం ఎర్రగుంటపల్లిలో అ క్రమంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులను మూ సివేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దండేపల్లి మండలం లింగాపూర్లో ప్రజల సౌకర్యార్థం అప్రోచ్రోడ్డు పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు విచారణతో పాటు ఎఫ్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు సంబంధిత ఎస్హెచ్వోలు, సీఐలు, ఎస్ఐల సమన్వయంతో విచారణ ప్రక్రియ వేగంగా జరుపుతామని తెలిపారు. సివిల్ రైట్స్డే సందర్భంగా సీఐలు, ఎస్ఐలు గ్రామసభల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం, కమిటీ సభ్యులు వెంకటేశం, అంజయ్య, సత్యనారాయణ, లింగయ్య, స్వచ్ఛంద సంస్థల సభ్యులు మాధవన్, సరోజ, అధికారులు పాల్గొన్నారు.
అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగు పర్చడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత పోస్టర్లను విడుదల చేశారు.