ఇచ్చోడ, నవంబర్ 29 : ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమైన బోథ్ నియోజకవర్గంలో గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అమలు చేసిన పథకాలు నియోజకవర్గ ప్రజలకు వరంగా మారాయి. వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయించడంతో నియోజకవర్గంలో వైద్య, విద్య, సాగునీరు, వ్యవసాయం ఇతర రంగాల్లో అభివృద్ధి సాధించింది. మిషన్ కాకతీయ పథకం ద్వారా సాగునీరు అందిస్తున్నది. గతంలో అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పిస్తుంది.
పదేళ్లలో చేసిన అభివృద్ధి
పర్యాటక అభివృద్ధికి కృషి
బోథ్ నియోజకవర్గంలో ఆసియా ఖండంలోనే ఎత్తైన జలపాతం కుంటల. అభివృద్ధి కోసం రూ.3 కోట్ల 80 లక్షలు మంజూరు చేసింది. అలాగే నేరడిగొండ నుంచి కుంటల జలపాతానికి రూ.2 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మించింది. రూ.9 కోట్లతో బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద అర్బన్ పార్క్ నిర్మాణం చేపట్టింది. బోథ్ నియోజకవర్గంలో 29.39 కోట్లతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువలు, చెరువులు, రూ.368 కోట్లతో పిప్పల్కోటి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టింది. రూ.69 కోట్లతో 25 చెక్డ్యాంలను ఏర్పాటు చేసింది. 19 నూతన చెరువుల నిర్మాణానికి, కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.794.33 కోట్లు మంజూరు చేసింది.
రహదారులు , వంతెనల నిర్మాణం
రూ.6.52 కోట్లతో బోథ్ నుంచి నిర్మల్ జిల్లా సారంగపూర్ ఆడెల్లి పోచమ్మ ఆలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. వీటి పాటు నియోజకవర్గంలో రూ.42.29 కోట్లతో మారుమూల గిరిజన గ్రామాలకు ప్రభుత్వం బీటీ రోడ్లు, రూ.6.40 కోట్లతో బజార్హత్నూర్ మండలం కొల్హారి నుంచి ముర్కండి వంతెన, రూ.18 కోట్లతో జమీందపూర్ నుంచి కరంజి వరకు బీటీ రోడ్డు, రూ.53.68 కోట్లతో నియోజకవర్గంలోని పంచాయతీ ఇంజినీరింగ్ రోడ్ల నిర్మాణం, రూ.7.39 కోట్లతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో వంతెన నిర్మాణాలు చేపట్టారు. రూ.13 కోట్లు ఇచ్చోడ రోడ్డు నిర్మాణానికి మంజూరు చేసింది.
వైద్య సేవలకు పెద్ద పీట
బోథ్లో 30 పడకల కమ్యూనిటీ దవాఖాన భవన నిర్మాణానికి రూ.10.50 కోట్లు మంజూర చేయగా పనులు ప్రారంభమయ్యాయి. బోథ్ నియోజకవర్గంలో రూ.144 లక్షలతో తలమడుగు, భీంపూర్, పొచ్చెర, బోరిగామ, తలమద్రి, ఇచ్చోడ, అందూర్, చింతలబోరి, కరత్వాడలో ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నారు.
బీఆర్ఎస్తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం
గత ప్రభుత్వాత హయాంలో బోథ్ అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల్లో వైద్య, విద్య, రవాణా, సాగునీరు, వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో గణనీయంగా అభివృద్ధిలో దూసుకుపోతుంది. ప్రభుత్వం మహిళలకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు, దివ్యాంగులకు పింఛన్ అందిస్తోంది. ప్రజల్లోకి వెళ్తే బీఆర్ఎస్కు ఓటు వేస్తామని అంటున్నారు. బీఆర్ఎస్తోనే నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలు అంటున్నారు.
– జాదవ్ అనిల్, బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి