ఎదులాపురం, సెప్టెంబర్ 22: సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత, ఉపయోగాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గురువారం జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. డయల్100 ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డయల్ 100కు ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లో పోలీసులు బాధితుల వద్దకు చేరుకుంటారని తెలిపారు. సీసీ కెమెరాల వల్ల నేరాల సంఖ్య అదపులోకి వస్తుందని, నేరస్తులను త్వరగా పట్టుకోవడంలో ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. రాత్రి పూట పట్టణంలో ఎక్కువ సంఖ్యలో గస్తీ నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పని తీరు, నమోదైన కేసుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిభ చూపిన 15 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డు అందజేసి ప్రశంసించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో నిర్విరామంగా పనిచేసిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. దసరా ఉత్సవాలను కూడా ఇదే విధంగా విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి చూపిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, డీటీసీ సీ సమయ్జాన్రావు, ఏఎస్పీ ఉట్నూర్ హర్షవర్ధన్, ఆదిలాబాద్ డీఎస్పీ వీ ఉమేందర్, సీఐలు పీ సురేందర్, కే శ్రీధర్, కే మల్లేశ్, బీ రఘుపతి, జే సైదారావు, కే ప్రేమ్కుమార్, ఈ చంద్రమౌళి, జే కృష్ణమూర్తి, జే గుణవంత్రావు, ఆర్ఐలు, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అన్వర్ ఉల్ హక్ ఉన్నారు.
సీఐ రమేశ్ బాబుకు నివాళి
ఇచ్చోడ సీఐ వై రమేశ్ బాబు ఇటీవల అనారోగ్యతో మృతి చెందగా, పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా పోలీసు అధికారులు నివాళులర్పించారు. ఎస్పీ, అధికారులు రమేశ్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. విధి నిర్వహణలో రమేశ్ బాబు చేసిన సేవలను కొనియాడారు.