ఇచ్చోడ, ఏప్రిల్ 29 : ఇతర రాష్ర్టాలకు చెందిన యువకులు ఆదిలాబాద్ జిల్లావాసులుగా తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పొందిన ముగ్గురిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఎస్బీ, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్ గ్రామం నుంచి 14 మంది, కొకస్ మన్నూర్ గ్రామం నుంచి ఒకరు, సిరికొండ మండలంలోని పొన్న నుంచి ఒకరు చొప్పున నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల నుంచి ఉద్యోగాలు పొందగా.. ఎంపికైన వారి సర్టిఫికెట్ల విచారణ కోసం గ్రామాల్లోకి వచ్చారు. తమ గ్రామాల నుంచి ఎవరు ఆర్మీకి ఎంపిక కాలేదని గ్రామస్తులు తెలుపడంతో వ్యవహారం బయటపడింది.
ఒక ఇస్లాంనగర్ గ్రామం నుంచి సూరజ్ సహాని, బిపిన్ యాదవ్, అతుల్ కుమార్ యాదవ్, రాజ్కుమార్ పాటిల్, అంకిత్ పటేల్, దీపక్ కుమార్ పటేల్, జైనూల్ అభిదునఖన్, మిరాజ్ అన్సారీ, అసద్ ఖాన్, వినయ్ వర్మ, నాగేంద్ర యాదవ్, అబిద్ ఖాన్, శుభాందుబే, కుల్దీప్ తివారీలు నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి నివాస ధ్రువీకరణ కోసం పోలీసులు రెవెన్యూ కార్యాలయంలో ఎంక్వైరీ చేయగా నకిలీ ధ్రువీకరణాలుగా నిర్ధారణ అయింది.
కొకస్ మన్నూర్ నుంచి సందీప్ కుమార్, పొన్నా నుంచి రోహిత్ బాబులు నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొంది ఆర్మీ ఉద్యోగాలకు ఎంపిక కాగా.. ఎస్బీ పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం వెనుక మండల కేంద్రంలోని ఒక మీ సేవా సెంటర్ నుంచి మొత్తం వ్యవహారం నడిచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఇస్లాంనగర్కు చెందిన సహాని సూరజ్, కొకస్ మన్నూర్ గ్రామానికి చెందిన గజేందర్, దుగ్విజయ్ విసుకర్మలు ఫోర్జరీ సతకం చేసినట్లు ఎస్బీ ఎక్వయిరీలో తెలడంతో రెవెన్యూ, ఎస్బీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.