క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత అమ్మకాలు, కొనుగోళ్లు చాలా ఈజీ అయ్యాయి. ముఖ్యంగా షాప్లలో పీఓఎస్ మెషీన్ ద్వారా క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించి ఏదైనా కొనేయొచ్చు. వీటిలో క్రెడిట్ కార్డును ఉపయోగించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన కాంటాక్ట్లెస్ అందులో ఒకటి. రూ.5 వేల వరకూ ట్రాన్సాక్షన్లకు ఈ పద్ధతిని ఎలాంటి పిన్ నంబర్ అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. మరొకటి పిన్ ఎంటర్ చేయడం ద్వారా చేసే ట్రాన్సాక్షన్. ఇక్కడే మెషీన్లను బోల్తా కొట్టించవచ్చని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.
ఆ ఆండ్రాయిడ్ యాప్ ఉంటే చాలు..
ఈ మోసం ఎలా జరగవచ్చో ఈటీహెచ్ జ్యూరిక్కు చెందిన పరిశోధకులు చేసి చూపించారు. ముఖ్యంగా మాస్టర్కార్డ్ లేదా మ్యాస్ట్రో క్రెడిట్ కార్డులు పిన్ లేకుండానే ట్రాన్సాక్షన్లు జరిగే అవకాశాన్ని ఇస్తున్నట్లు వీళ్లు చెప్పారు. గతంలో వీసా కార్డులను కూడా ఇలాగే బోల్తా కొట్టించారు. అయితే ఈ మోసం ఎలా జరుగుతుందో వాళ్లు వివరించారు. దీని కోసం ఒక ఆండ్రాయిడ్ యాప్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) సౌకర్యం ఉన్న రెండు ఫోన్లను ఉపయోగించారు. ఈ యాప్ ద్వారా కార్డు ఉపయోగించే మెషీన్ను బోల్తా కొట్టించవచ్చు. పిన్ అవసరమైనా కూడా అది అవసరం లేదని చూపిస్తుందని పరిశోధకులు చెప్పారు. సదరు మెషీన్ మాస్టర్కార్డును వీసా కార్డుగా భావించి ట్రాన్సాక్షన్ పూర్తి చేస్తుందని కూడా వాళ్లు వెల్లడించారు.
ఎలా జరుగుతుంది?
రీసెర్చర్లలో ఒకరైన జార్జ్ టోరో దీని గురించి వివరించారు. ఆండ్రాయిడ్ యాప్ ఉపయోగించి కార్డు మెషీన్ను మాస్టర్కార్డును వీసా కార్డుగా బోల్తా కొట్టించవచ్చని ఆయన చెప్పారు. నిజానికి వాస్తవం మరింత సంక్లిష్టంగా ఉంటుందని, దీని కోసం ఒకే సమయంలో రెండు సెషన్లను జరపాల్సి ఉంటుందని తెలిపారు. కార్డు టెర్మినల్ వీసా కార్డు ట్రాన్సాక్షన్ జరిపితే.. కార్డు మాత్రం మాస్టర్ కార్డ్ ట్రాన్సాక్షన్నే నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. ఈ పద్ధతులను నాలుగు వివిధ బ్యాంకులు జారీ చేసిన రెండు మాస్టర్కార్డ్ క్రెడిట్ కార్డులు, రెండు మ్యాస్ట్రో డెబిట్ కార్డులపై ప్రయోగించి చూశారు. మాస్టర్కార్డులో ఉన్న ఈ లోపాలపై సదరు సంస్థకు తాము వివరించినట్లు పరిశోధకులు చెప్పారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి మాస్టర్కార్డు పలు చర్యలు తీసుకున్నదని వాళ్లు వెల్లడించారు.