ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద
చివరి ఆయకట్టుకూ నీరు.. రెండు పంటలకు అవకాశం
రెండు జిల్లాల్లో 1.25 లక్షల ఎకరాల ఆయకట్టు
ఆదిలాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ప్రాజెక్టులు.. స్వరాష్ట్రంలో నిండుకుండలను తలపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయించడంతో నీటి నిల్వలు, భూగర్భ జలాలు పెరిగి చివరి ఆయకట్టుకూ నీరందుతున్నది. అంతకముందు ఒక పంట వేసిన రైతులు.. ప్రస్తుతం రెండు పంటలు సాగు చేస్తున్నారు. తాజాగా.. ఈ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు భారీగా కురుస్తుండడం, ఎగువ ప్రాంతాల నుంచి వరద చేరుతుండడంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఇన్ఫ్లో భారీగా చేరుతుండడంతో వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో ఐదు జలాశయాలు ఉండగా.. దాదాపు 1.25 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది..
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన సాగు నీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టిసారించింది. పెండింగ్లో ఉన్న పనులకు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తిచేయించింది. అవసరమైన చోట మరమ్మతులు కూడా చేయించింది. ఫలితంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా.. ఆయకట్టూ పెరిగింది. ఈ ఏడాది వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 367.8 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 614.7 మిల్లీ మీటర్ల్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లాలో 310 మిల్లీ మీటర్లకు 393 మిల్లీ మీటర్ల వర్షం పడింది. రెండు జిల్లాలోనూ సాధారణం కంటే అధిక వర్షం పడింది. వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. దీంతో రెండు జిల్లాల్లోని ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి.
1,25,500 ఎకరాలకు సాగునీరు
రెండు జిల్లాల పరిధిలో ఐదు సాగు నీటి ప్రాజెక్టులు ఉండగా.. 1,25,500 ఎకరాలకు నీరు అందుతున్నది. కడెం ప్రాజెక్టు ద్వారా నిర్మల్ జిల్లాలోని కడెం, మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్, జన్నారం మండల్లాల్లోని 68 వేల ఎకరాలకు.. గడ్డెన్నవాగు ప్రాజెక్టు ద్వారా భైంసా, లోకేశ్వరం, ముథోల్ మండలాల్లోని 14వేలు.. స్వర్ణ ప్రాజెక్టు నుంచి సారంగాపూర్, నిర్మల్ మండలాల్లోని 11వేలు.. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టు ద్వారా జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని 24వేలు.. మత్తడివాగు ప్రాజెక్టు నుంచి తాంసి, భీంపూర్, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని 8,500 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుండడంతో తాము రెండు పంటలు సాగు చేసుంటామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టుల్లో నీటి నిల్వ వివరాలు..
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 700 అడుగులు(7.603టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 696. 050 అడుగులు(6.611టీఎంసీల) వద్ద ఉంది. కాగా, బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి జలాశయంలోకి 42,923 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో అధికారులు ఏడు వరదగేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి 50,743 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు కుడి కాలువకు 12 క్యూసెక్కులు, ప్రధాన కాలువకు 237 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడ్డెన్న వాగు నీటి నిల్వ సామర్థ్యం 1.852 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.477 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీట ర్లు కాగా ప్రస్తుతం 358 మీటర్ల వరకు నీరు ఉంది. స్వర్ణ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ప్రస్తు తం 1,181.4 అడుగుల మేర నీరు చేరింది. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.24 టీ ఎంసీలు కాగా 0.892 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 286.50 మీటర్లు కాగా ప్రస్తుతం 284. 95 మీటర్లు మేర నీరు ఉంది. మత్తడివాగు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 0.571 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.446 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 277.50 మీటర్లు కాగా 276.50 మీటర్ల నీరు ఉంది.
వరినాట్లకు సిద్ధమవుతున్నా..
సారంగాపూర్, జూలై 14: నాపేరు తడపకాల సృజన్. మాది స్వర్ణ గ్రామం. నాకు స్వర్ణ ప్రాజెక్టు ఆయకట్టు కింద రెండె కరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతి ఏడాది వరి పంట పండిస్తున్నా. భూమిని దుక్కిదున్ని వరి నాట్లు వేసుకోవడానికి సిద్ధమవుతున్నా. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా వర్షాలు అనుకున్నంత పడలేదు. అయినా ప్రాజెక్టులో నిండుగా నీళ్లు ఉన్నాయి. ఇవి ఈ పంటకు మస్తుగ సరిపోతయ్. గతేడాది వరి పంట మంచిగ వచ్చింది. ఎకరాకు 20క్వింటాళ్లకు పైగానే దిగుబడి వచ్చింది. ప్రాజెక్టు లేకుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. నీటి గోస లేకుండా పంటలను సాగు చేసుకుంటున్న.
–తడపకాల సృజన్, రైతు, స్వర్ణ