అందుబాటులో వివిధ విభాగాల వైద్య నిపుణులు
స్థానికంగా వివిధ వ్యాధులకు చికిత్స
ఆదిలాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోని ప్రజలకు సర్కారు దవాఖానల్లో పలు రకాల వైద్య సేవలు అందుతున్నాయి. రిమ్స్తో పాటు ఉట్నూర్, బోథ్ కమ్యూనిటీ దవాఖానలు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు పట్టణ హెల్త్ సెంటర్ల ద్వారా సర్కారు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది. దీంతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. సర్కారు అమలు చేస్తున్న అమ్మఒడి, కేసీఆర్ కిట్లాంటి పథకాలు గర్భిణులు, బాలింతలకు ఎంతో ప్రయోజనకరంగా మారాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం ప్రతినెలా 15 నుంచి 30 వరకు డెలివరీలు అవుతున్నాయి. కరోనాకు సైతం గ్రామాల్లో ప్రభుత్వం వైద్యం అందిస్తున్నది. నిర్ధారణ పరీక్షలతో పాటు వ్యాక్సిన్ను పంపిణీ చేస్తున్నది. ఏటా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలల పాటు వైద్య శాఖ అధికారులు ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వైద్య బృందాలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఎవరైనా జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నారనే విషయాలను తెలుసుకుంటారు. ఆరోగ్యపరమైన సమస్యలున్న వారికి చికిత్సలు అందిస్తారు. సర్కారు తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావం చాలా వరకు తగ్గింది.
అందుబాటులో వైద్య నిపుణులు..
జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలు అందుతున్నాయి. రోజూ 1500 నుంచి 2000 వరకు ఔట్ పేషెంట్ల సంఖ్య ఉంటుంది. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సైతం రిమ్స్కు వచ్చి చికిత్సలు తీసుకుంటారు. ఈ దవాఖానకు వచ్చే పేదలకు వివిధ రకాల వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 1 నుంచి వివిధ వ్యా ధుల వైద్య నిపుణులు రిమ్స్లో అందుబాటులో ఉంటారు. దవాఖాన ఔట్ పేషెంట్ ఏరియాలో 29-బీ గదిలో యూరాలజిస్ట్, న్యూరోసర్జన్, పీడియాట్రిస్ట్ సర్జన్ అందుబాటులో ఉంటారు. యూరాలజిస్ట్ వైద్యుడు ప్రతి శుక్రవా రం, న్యూరో సర్జన్ ప్రతి సోమ, మంగళవారాల్లో, చిన్న పిల్లల వైద్య నిపుణులు ప్రతి మంగళవారంతో పాటు రెండో, నా లుగో శనివారం రిమ్స్లో పేషెంట్లను చూస్తారు. జిల్లా ప్రజలు వివిధ రకాల వైద్య సేవల కోసం హైదరాబాద్, నాగ్పూర్ లాంటి పట్టణాలకు పోవాల్సి వస్తుంది. రిమ్స్కు వైద్యనిపుణులు రావడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.