తండ్రి పేరు..
లేదా సంరక్షకుడి పేరు..
అంతే, అమ్మకు స్థానం లేదు. అమ్మ పేరుకు విలువ లేదు. నవమాసాలు మోసేది అమ్మ. చనుబాలిచ్చి పెంచేది అమ్మ. కనుపాపలా కాపాడేది అమ్మ. బిడ్డ విషయంలో ప్రకృతి అమ్మకే తొలిస్థానం ఇచ్చింది. కానీ చట్టం మాత్రం.. మాతృమూర్తి ఉనికినే గుర్తించడం లేదు. ఈ వివక్షను ఒంటరి అమ్మలు ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానాల్లో కేసులు వేస్తున్నారు.
పెద్ద చదువులకు కూతురిని విదేశాలకు పంపేందుకు పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రియాంక గుప్తా. ‘డాటర్ ఆఫ్..’ కాలంలో తండ్రిపేరుకు బదులుగా తన పేరు రాసిందామె. అధికారులు ఆ పత్రాలను తిరస్కరించారు. తండ్రి పేరు రాయాల్సిందేనన్నారు. ‘కూతురు పుట్టిందని తెలియగానే అతను విడాకులు తీసుకున్నాడు. నా బిడ్డకు తండ్రి లేడు. తల్లి మాత్రమే ఉంది. అది నేనే. అందుకే నా పేరు రాశాను’ అంటూ విడాకుల పత్రం చూపించింది. అయినా, కుదరదని చెప్పారు. ఇన్నాళ్లూ.. ఒంటరి మహిళగా వ్యవస్థను ఎదిరించి బతికిన ప్రియాంక.. తనలాంటి తల్లుల కోసం .. తండ్రితో పాటు తల్లిపేరు కూడా అన్ని పత్రాల్లో ఉండాలంటూ వ్యవస్థపై పోరాటం మొదలుపెట్టింది. నేరుగా కోర్టుకు వెళ్లింది. ఒంటరి తల్లులతో కలిసి గళమెత్తింది. దీంతో పాస్పోర్ట్ యంత్రాంగం దిగొచ్చింది. అనుమతి మంజూరు చేసింది.
కేరళలోనూ..
కేరళకు చెందిన ఓ బాలిక బడి వయసులోనే ప్రేమలో పడింది. పదో తరగతిలో గర్భం దాల్చింది. కారణమైనవాడు మొహం చాటేశాడు. కానీ సర్టిఫికెట్ల మీద మాత్రం తండ్రిగా అతనిపేరే రాయించింది. తల్లి మతాన్నే బిడ్డా అనుసరించాడు. ఇంటర్ సర్టిఫికెట్లో బిడ్డకు ఓ మతానికి సంబంధించిన పేరు, తండ్రికి మరో మతానికి సంబంధించిన పేరు ఉండటంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో తండ్రి స్థానంలో తల్లి పేరు నమోదు చేయాలంటూ ఆ తల్లి కోర్టుకెళ్లింది. కేరళ హైకోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరో కేసులో.. ఢిల్లీకి చెందిన రిచా చద్దా రెండేండ్ల క్రితం విడాకులు తీసుకున్నది.
తన కూతురి విద్యా ధ్రువపత్రాల మీద తన పేరుకూ స్థానం కల్పించాలని పోరాటం ప్రారంభించింది. వాదోపవాదాల తర్వాత ఉన్నత న్యాయస్థానం ఆదేశంతో ఆమె కూతురి సర్టిఫికెట్లలో ‘డాటర్ ఆఫ్ రిచా చద్దా’గా మార్చారు. నిజానికి తన బిడ్డ సర్టి ఫికెట్లలో తన పేరు కోసం ఓ తల్లి ఇంత పోరాడాల్సిన పన్లేదు. భారత రాజ్యాంగం కల్పించిన ‘సమానత్వపు హక్కు’లో ఇదో భాగం. అయినా వివక్ష కొనసాగుతున్నది. అధికారిక ధ్రువీకరణ పత్రాల్లో తండ్రితో పాటు, తల్లిపేరునూ చేర్చాలంటూ పెద్ద యుద్ధమే మొదలైంది. న్యాయస్థానాల్లో హిందూ మైనారిటీ, గార్డియన్షిప్ చట్టం (1956) చెల్లుబాటును సవాలుచేస్తున్నారు. అచ్చులో అమ్మ పేరు కనిపించే రోజు ఎంతోదూరం లేదు.