వందమాటలు చెప్పలేని భావాన్ని ఒక్క చిత్రం వివరిస్తుంది. ఆ మాటను నిజం చేస్తూ తన చిత్రకళతో మహిళల పట్ల వివక్ష చూపే సమాజానికి కొర్రుకాల్చి వాతపెడుతున్నారు ఢిల్లీకి చెందిన ఇలస్ట్రేటర్ ఆయుష్ కల్రా. ఆడపిల్లలకు మాత్రమే వర్తించే కట్టుబాట్లు, ప్రవర్తన, ఆహార్యం.. ఇలా విభిన్న విషయాల మీద చిత్రాలు గీస్తారు ఆయుష్. లోగ్ క్యా కహేంగా దీదీ (జనం ఏం మాట్లాడతారు అక్కా!) పేరుతో అతను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఇలస్ట్రేషన్ సిరీస్ ఎంతో మందిని ఆకర్షించింది.
ఇవన్నీ రోజువారీ జీవితంలో మహిళలు ఎదుర్కొనేవే. ‘నా కళ స్త్రీత్వానికి మద్దతు ఇస్తుంది. వాళ్ల బాధ, అసహనం, అభిరుచులు, ఆశలు.. ఇలా అన్నిటినీ ప్రతిబింబిస్తుంది. తరతరాలుగా పాతుకుపోయిన అభిప్రాయాలను ఇప్పటికీ ఆడపిల్లల మీద బలవంతంగా రుద్దుతున్నారు. ఇప్పటికైనా వాళ్లను చూసే కోణంలో, వాళ్ల గురించి ఆలోచించే పద్ధతిలో మార్పు రావాలన్నదే నా ఉద్దేశం. అయితే ఏ విషయం పట్ల అయినా మనకు బలమైన అభిప్రాయాలు ఉంటే సరిపోదు, వాటిని పదిమందితో పంచుకోవాలి. ఒక అంశానికి సంబంధించి విభిన్న కోణాలు తెలిసినప్పుడే మనిషి ఆలోచనల్లో మార్పు వస్తుంది. తద్వారా సమాజమూ మారుతుంది. నేను ఆ ప్రయత్నమే చేస్తున్నా’ అంటారు ఆయుష్. అవును, ఆలోచనకు మాత్రమే అజ్ఞానాన్ని తరిమేసే శక్తి ఉంది.. ఆ ప్రయత్నంలో ఇదొక కొత్తదారి.