‘సంతోషమే సగం బలం’ అంటారు. కానీ, ఆ సంతసాన్ని సొంతం చేసుకోవడానికి సుంతైనా ప్రయత్నించరు చాలామంది. మనసులో భారం తగ్గడానికి ఓదార్పు కావాలి. అదే మనసు నిండా సంతోషం వెల్లివిరియాలంటే ఆలోచన సరళి మారాలని అంటున్నారు హైదరాబాద్కు చెందిన జి.సి.కవిత. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషనల్ స్పీకర్గా, సైకాలజిస్ట్గా, కౌన్సెలర్గా పలు సంస్థల్లో స్వచ్ఛందంగా పనిచేస్తున్నారామె! తన మాటల ద్వారా లక్షల మందికి సంతోషాన్ని పంచుతున్న కవితను ‘జిందగీ’ పలుకరించింది.
ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
ఆనందం మన జన్మహక్కు. కానీ, ఆశయాల కోసం పరిగెడుతూ, ఆశల పల్లకీలో ఊరేగుతూ.. ఎన్నో ఆనందాలను కోల్పోతున్నాం. లేచింది మొదలు అరిగిపోయిన బ్రష్ గురించో, పగిలిపోయిన కప్పు గురించో, ఎత్తిపోయిన బస్సు గురించో ఆలోచిస్తూ రోజంతా భారంగా గడిపేస్తున్నాం. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోని పాజిటివిటీ నుంచి సంతోషాన్ని ఆస్వాదించాలి. అదెలా గుర్తించాలో చెప్పడమే నా పని. మా నాన్న శ్రీహరికోటలో సైంటిస్ట్గా చేసేవారు. నా చదువంతా అక్కడే సాగింది. డిగ్రీ అయిపోగానే పెండ్లయింది. తర్వాత ముంబైలో కొన్నాళ్లు, చెన్నైలో కొన్నాళ్లు ఉన్నాం. పదేండ్ల క్రితం హైదరాబాద్లో స్థిరపడ్డాం. అప్పటికే మాకు ఏడాది పాప. ఆ సమయంలో చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందన్న దానిపై ఫోకస్ పెరిగింది. ‘పాటర్ అండ్ క్లే’ పేరుతో హబ్సిగూడలో స్కూల్ పెట్టాను. అందులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మాత్రమే ఉండేవి. అదే సమయంలో బీఎస్సీ పాసయ్యాను. సైకాలజీలో ఎంఏ, ఎం.ఎస్ (కౌన్సెలింగ్ అండ్ సైకోథెరపీ) తర్వాత పాజిటివ్ సైకాలజీలో పీహెచ్డీ చేశాను. వివిధ పీజీ డిప్లొమాలు, సర్టిఫికెట్ కోర్సులు చేశాను.
పాజిటివ్ లెర్నింగ్..
2010లో సొంతంగా ‘సెంటర్ ఫర్ పాజిటివ్ లెర్నింగ్’ సంస్థను ప్రారంభించాను. మొదట్లో వివిధ స్కూళ్లకు వెళ్లి ఒలింపియాడ్స్ నిర్వహించేదాన్ని. మోటివేషనల్ క్లాస్లు తీసుకునేదాన్ని. తర్వాత బహుళజాతి కంపెనీలకు కంటెంట్ ఇచ్చేదాన్ని. ఆ సమయంలోనే మా ఇంటికి ఓ పసిబిడ్డ తల్లి వచ్చింది. ఎప్పుడూ దిగాలుగా ఉండేది. ఆమె ఆనందం కోసం పాప బర్త్డే ఘనంగా నిర్వహించాం. ఆ నిమిషంలో మొహం వెలిగిపోయినా, మళ్లీ మూడీగా మారిపోయింది. అప్పుడు తనకు హ్యాపీనెస్ మీద కౌన్సెలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను.
ఆరు
నెలల్లో ఆ తల్లి ముఖంలో నవ్వు కనిపించింది. ఇలా మరికొందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని అనుకున్నాను. ఆ క్రమంలో నిజమైన ఆనందం అంటే ఏమిటో, దాన్ని ఎలా సొంతం చేసుకోవాలో నాకూ అర్థమైంది.
ఆసక్తితో ముందుకు
అనుకున్నది నెరవేరితే ఆనందం కలుగుతుందా? అని ఆలోచిస్తున్నప్పుడు, నా గతానుభవంలో నుంచే జవాబు దొరికింది. కోరుకున్న వస్తువును కొన్నప్పుడు, నచ్చిన ఇల్లు సొంతమైనప్పుడు కలిగే ఆనందం కన్నా.. మా ఇంట్లో పనమ్మాయి ముఖంలో నవ్వు చూసినప్పుడు నాకు కలిగిన ఆనందం ఎంతో విలువైందని అనిపించింది. ఇలా ఆలోచించడం మొదలుపెట్టాక, నాకు పాజిటివ్ సైకాలజీపై ఆసక్తి కలిగింది. సాధారణంగా సైకాలజీలో సమస్య, దాని పరిష్కారం గురించే ఉంటుంది. కానీ, పాజిటివ్ సైకాలజీ అంటే ఆనందం మీద పూర్తి ఫోకస్ ఉంటుంది. ఎన్నో పుస్తకాలు చదివి, సెమినార్లకు హాజరయ్యాక కానీ నాకు అవగాహన కలుగలేదు. తర్వాత అందులోనే పీహెచ్డీ చేశాను.
జన్మహక్కు
మనకు ఏదైనా చేదు అనుభవం ఎదురైతే ఆ రోజంతా దాని గురించే కలత చెందుతూ ఉంటాం. కానీ, అది సరైన పద్ధతి కాదు. అనుకోవాలే కానీ మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచీ ఆనందాన్ని పొందవచ్చు. ఈ కాన్సెప్ట్తో ‘హ్యాపీనెస్ ఈజ్ అవర్ బర్త్ రైట్’ మొదలుపెట్టాను. ఇందులో భాగంగా హ్యాపీనెస్ వర్క్షాపులు నిర్వహిస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మందికి హ్యాపీనెస్ గురించి చెప్పాను. పదిలక్షలమంది ప్రేక్షకులకు నా హ్యాపీనెస్ కౌన్సెలింగ్ చేరాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాను. మురికివాడలు, అనాథాశ్రమాలు, స్కూళ్లు, కాలేజీలు, బాలనేరస్థుల జైళ్లు, దివ్యాంగుల సంస్థలకు వెళ్లి వర్క్షాప్లు నిర్వహిస్తున్నాను. ఆనందంగా ఎలా ఉండాలో చెప్పడానికే నా ప్రయత్నమంతా. ప్రతి సోమవారం ఆన్లైన్ కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నాను.
ఆనందాన్ని పంచడమే..
కౌన్సెలింగ్ కోసం ఎవరు, ఎప్పుడు నన్ను సంప్రదించినా సమయం కేటాయిస్తాను. ప్రస్తుతం ‘వెల్నెస్ ఫర్ ఇండియా -కోవిన్ యాక్షన్ నెట్వర్క్ సెంట్రల్ టీమ్’కు నేషనల్ కో-ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. అలాగే ఎన్సీపీసీఆర్ ‘సంవేదన’ ప్రాజెక్ట్కు ఇన్చార్జిగా ఉన్నాను. పలు రకాల సంస్థలు, ఫౌండేషన్లతో కలిసి హ్యాపీనెస్ కౌన్సెలింగ్ ఇస్తున్నాను. ఈ క్రమంలో అనేక అవార్డులు అందుకున్నా. ఏపీజే అబ్దుల్కలాం గారి బయోపిక్కు నన్ను రచయితగా ఎంచుకున్నారు. నిజానికి, వీటిన్నిటివల్ల కలిగిన ఆనందం కన్నా.. నా కౌన్సెలింగ్తో జీవనశైలిని మార్చుకున్న వారిని చూసినప్పుడు కలిగే ఆనందమే వేయిరెట్లు ఎక్కువ.
సొంత అధ్యయనం
ఓసారి అధ్యయనంలో భాగంగా ‘నిన్న మిమ్మల్ని సంతోషపెట్టిన మూడు విషయాలు చెప్పండి?’ అనడిగాను. చాలామంది సరైన జవాబు ఇవ్వలేకపోయారు. చెప్పినవాళ్లూ భౌతికమైన ఆనందం గురించే చెప్పారు. అదే సమయంలో ‘బాధపడ్డ సంగతులేవి?’ అని అడిగితే మాత్రం, వెంటనే సమాధానాలు ఇచ్చారు. మనిషి ఎప్పుడూ గతం తాలూకు చేదు అనుభవాలతో, భవిష్యత్లో ఏం అవుతుందోనన్న భయంతో సతమతం అవుతూ ఉంటాడు. నిజమైన సంతోషం ఏమిటో తెలుసుకుంటే తన దృక్పథం తప్పక మారుతుంది.
నిఖిత నెల్లుట్ల