ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో మొట్టమొదటి చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్. ఆ ప్రతిష్ఠాత్మక పదవి మరో రెండేండ్లు ఉండగానే రాజీనామా ప్రకటించారామె. భారతదేశంలో ప్రజారోగ్య సేవలు అందించేందుకే తానీ నిర్ణయాన్ని తీసుకున్నానని చెబుతున్నారు సౌమ్య.
డాక్టర్ సౌమ్య.. తండ్రి డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్కు తగ్గ తనయ. దేశమంటే ప్రేమ. అణగారిన వర్గాలంటే అభిమానం. పరిశోధనలంటే అమితమైన ప్రీతి. ఇద్దరి ఆశయాలూ ఒకటే అయినా, మార్గాలు మాత్రం వేరువేరు. ఆయన భారతదేశంలో సేద్యాన్ని సస్యశ్యామలం చేస్తే, ఈమె ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం అహరహం శ్రమిస్తున్నారు. ఆ ప్రస్థానమంతా సౌమ్య మాటల్లోనే..
చీఫ్ సైంటిస్ట్గా..
నాకు జంతువులంటే ఇష్టం. అందుకే, ఢిల్లీలోని ఓ పేరున్న కాలేజీలో బీఎస్సీ జువాలజీలో చేరాను. కానీ, స్నేహితులంతా మెడిసిన్కు సన్నద్ధం అవుతుంటే, నేను కూడా వెళ్లి పరీక్ష రాశాను. అనుకోకుండా సీటు వచ్చింది. దీంతో ఎంబీబీఎస్ పూర్తి చేసి, చిన్న పిల్లల వైద్యంలో ఎండీ చేశాను. తర్వాత, పిల్లల్లో శ్వాసకోశ సమస్యల మీద పరిశోధన కోసం యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్కు వెళ్లాను. అక్కడ చదువు పూర్తి చేసుకుని వచ్చి పిల్లల్లో క్షయ నివారణ- చికిత్సపై పరిశోధనలు చేశాను. హెచ్ఐవీకి సంబంధించి కూడా రీసెర్చ్ చేశాను. ఈ రెండూ నాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్ క్యులోసిస్కు డైరెక్టర్గా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు డైరెక్టర్ జనరల్గా వ్యవహరించాను.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహ్వానం మేరకు డబ్ల్యూహెచ్వో ప్రోగ్రామ్స్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వర్తించాను. అందులోనూ సైన్స్ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాక మొట్ట మొదటి చీఫ్ సైంటిస్టును నేనే. ఇదే సమయంలో ఊహించని రీతిలో కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కబళించడం ప్రారంభించింది. ఆ సమ యంలో కరోనా కట్టడికి పాటించాల్సిన నియమావళిని మేమే తయారుచేశాం. రోగి ఎన్ని రోజులు క్వారంటైన్లో ఉండాలి, ఏమేం జాగ్రత్తలు పాటించాలి, ఏ మందులు వాడాలి? అన్న విషయాల మీద త్వరితగతిన ట్రయల్స్ నిర్వహిస్తూ.. ఆ ఫలితాలు ప్రపంచానికి చేరవేసేందుకు ఎంతో శ్రమించాం.
నిజం చేయాలని..
ఆరోగ్య రంగం మీద భారత్లాంటి దేశాలు చాలా శ్రద్ధ పెడుతున్నాయి. అయితే, ఓ వ్యక్తి రోగంతో ఆసుపత్రిలో చేరాకే మనం వైద్యం చేస్తున్నాం. అలా కాకుండా, ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగలిగితే.. ప్రాణాంతక సమస్యల నుంచి తొలి దశలోనే క్షేమంగా బయటపడేయవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనం అందించగలిగేది 20 శాతం రక్షణ మాత్రమే. కానీ పౌష్టికాహార కొరత, సమతులాహార లోపం, వాయు కాలుష్యం, తాగునీటిలో నాణ్యత లోపం, పరిసరాల పరిశుభ్రత, పొగాకు, మద్యంలాంటి వ్యసనాలు, జీవనశైలి లోపాలు.. వీటన్నిటి పట్లా మనం శ్రద్ధ తీసుకోవాలి. అదే సమ యంలో స్క్రీనింగ్ పరీక్షలూ సామాన్యులకు చేరువ కావాలి. ప్రస్తుతం మారుమూల పల్లెల్లో కూడా స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చింది. రకరకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే యాప్లు వస్తున్నాయి. అవి ఎంత వరకు సమర్థమైనవో నిపుణులు నిర్ధారించాలి. వాటిని చట్టం పరిధిలోకి తీసుకురావాలి.
మొత్తంగా ఓ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అప్పుడే, ప్రతి వ్యక్తీ నాణ్యమైన ఆరోగ్య సేవల్ని అందుకోగలడు. దీనికి సంబంధించి నేను ప్రపంచ ఆరోగ్య సంస్థతో లోతైన చర్చలు జరిపాను. ఆ ఆలోచనకు కార్యరూపాన్ని ఇవ్వాలనే.. ఉద్యోగానికి రాజీనామా చేశాను. భారత్ను ఆరోగ్య విప్లవం దిశగా నడిపించాలనే సంకల్పంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.