సిద్ధు చురుకైన అబ్బాయి. నీతూ తెలివైన అమ్మాయి.ఈ ఇద్దరూ ఒక్కరే! మగాడిగా పుట్టి తనలోని ఆడతనానికి తలవంచిన సిద్ధు.. ‘నీతూ’గా మారాడు. లింగమార్పిడితో అమ్మాయిగా మారిన ట్రాన్స్జెండర్ నీతూ కథ ఇది.
నీతూది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్. అసలు పేరు సిద్ధు. తండ్రి సింగరేణి కార్మికుడు. అమ్మ గృహిణి. అక్క, తమ్ముడు. సింగరేణి పాఠశాలలోనే చదువు సాగింది. ఆటపాటలతో హాయిగా సాగుతున్న సిద్ధూ జీవితంలో ఓ అలజడి. పైకి అబ్బాయిగా కనిపిస్తున్నా.. మనసులో ఆడతనం తొంగి చూసేది. ఇంట్లోవాళ్లకు తెలియకుండా దాచినా.. స్నేహితులు తన ప్రవర్తన చూసి నానామాటలూ అనేవారు. ‘నా లోపమేంటో నాకు అర్థమయ్యేది కాదు. స్నేహితుల అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవాణ్ని. కానీ, నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నా. బాగా చదువుకోవడమే పరిష్కారం అనుకున్నా’ అని గతాన్ని గుర్తుచేసుకుంటుంది నీతూ.
మలుపు తిరిగిన జీవితం..
ఒకరోజు సిద్ధూకు శ్రీరాంపుర్కు చెందిన ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మాటల్లో తనూ అదే సమస్యతో సతమతమవుతున్నాడని తెలిసింది. ఇద్దరూ స్నేహితులయ్యారు. అతని ద్వారానే లింగమార్పిడి గురించి సిద్ధూకి తెలిసింది. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడానికి వరంగల్ వెళ్లాడు. అక్కడ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని నిర్వహిస్తున్న రోషిణీని కలిశాడు. ఆమెతో పరిచయం తర్వాత అమ్మాయిగా మారిపోవాలని నిర్ణయించుకున్నాడు సిద్ధు. ‘ముందుగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశా. తర్వాత నాలాంటి మరి కొందరి ఆర్థిక సహకారంతో ఢిల్లీ వెళ్లి సర్జరీ చేయించుకున్నా. సిద్ధూగా ఉన్న నేను పూర్తిగా మారిపోయాను’ అనిచెప్పుకొచ్చింది నీతూ.
కమ్యూనిటీ ఆదుకుంది
తన లింగమార్పిడి విషయాన్ని ఇంట్లో వాళ్ల దగ్గర గోప్యంగా ఉంచింది. ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎంబీఏ పట్టా చేతిలో ఉన్నా.. ట్రాన్స్జెండర్ అని తెలిసి ఎవరూ ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు. ‘నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాలేదు. ఆ సమయంలో మా కమ్యూనిటీ వాళ్లే నన్ను ఆదుకున్నారు. కొన్నాళ్లు నేనూ భిక్షాటన చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చూసేవారు. కొందరు వంటిమీద చేతులు వేసేవారు. భిక్షాటన చేస్తూనే వివిధ ఎన్జీవోల ఉద్యోగ ప్రకటనలు చూసి దరఖాస్తు చేస్తుండేదాన్ని. నా విద్యార్హతలు చూసి విజయవాడకు చెందిన అలయెన్స్ సేవా సంస్థ జిల్లా అడ్వకసీ ఆఫీసర్గా అవకాశం ఇచ్చింది’ అని చెప్పుకొచ్చింది నీతూ. ఆ సంస్థలో మూడేండ్లు పనిచేసిందామె. మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత హైదరాబాద్కు చెందిన మారియడ్ అనే ఎన్జీవోలో స్టేట్ అడ్వకసీ అధికారిణిగా చేసింది. సంస్థ తరఫున హిజ్రాలు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది నీతూ.
తనలాంటి వారి కోసం
కొన్నాళ్లకు తోటి ట్రాన్స్జెండర్లకు అండగా ఉండాలనే ఆశయంతో ‘మాతృఛాయ’ పేరుతో సామాజిక సేవా సంస్థను ప్రారంభించింది నీతూ. ‘కరోనా సమయంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొన్న సమస్యలు నన్ను కదిలించాయి. మమ్మల్ని చూస్తేనే ఈసడించుకునేవారు. అందుకే మాకు మేమే సాయం అవ్వాలనుకున్నాం. పరివార్ సంస్థ సహకారంతో సుమారు 400 మందికి బియ్యం, నిత్యావసరాలు అందించాను. భవిష్యత్లో ట్రాన్స్జెండర్ల సమస్యలపట్ల స్పందించడమే కాకుండా వారి ఆరోగ్య విషయంలోనూ సలహాలు, సూచనలు అందించేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నా’ అంటున్నది నీతూ.
కూతురుగా అంగీకరించారు..
ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత మా ఇంటికి వెళ్లలేదు. ఎన్నోసార్లు అమ్మను, నాన్నను చూడాలనిపించేది. కానీ, మగాడిగా బయటికి వచ్చిన నేను.. మళ్లీ ఆడపిల్లగా ఇంట్లో అడుగుపెడితే వాళ్లు తట్టుకోగలరా? అనుకునేదాన్ని. ఏండ్లు గడుస్తున్నా ఇంటికి రాకపోయేసరికి వారికీ అనుమానం వచ్చి నిలదీశారు. అప్పుడు చెప్పక తప్పలేదు. మొదట చాలా బాధపడ్డారు. తర్వాత నేను బతుకుతున్న తీరు చూసి కూతురుగా స్వీకరించారు.
–మధుకర్ వైద్యుల